Most Expensive Over in IPL: ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు అద్భుతమైన ప్రారంభం లభించింది. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ప్రభ్సిమ్రాన్ సింగ్ను డకౌట్గా వెనక్కి పంపి పంజాబ్ను దెబ్బతీశాడు. అయితే, లక్నో ఆనందం ఎంతో సేపు నిలవలేదు. క్రీజులోకి వచ్చిన ప్రియాంష్ ఆర్య, కూపర్ కానలీలు లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. మైదానం నలుమూలలా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
మార్క్రామ్ ఓవర్లో పరుగుల వరద..
మ్యాచ్ 13వ ఓవర్లో కెప్టెన్ రిషబ్ పంత్, మార్క్రామ్ను బౌలింగ్కు దించాడు. అప్పటికే సెటిల్ అయిన పంజాబ్ బ్యాటర్లు మార్క్రామ్ను ఏమాత్రం కనికరించలేదు. ఆస్ట్రేలియా బ్యాటర్ కూపర్ కానలీ మొదటి మూడు బంతులకు వరుసగా మూడు భారీ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత మార్క్రామ్ ఒక వైడ్ వేయగా, తదుపరి బంతికి సింగిల్ లభించింది. కానీ, చివరి రెండు బంతులకు ప్రియాంష్ ఆర్య వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్లో మొత్తం 32 పరుగులు వచ్చాయి. ఇది ఐపీఎల్ చరిత్రలోనే లక్నో జట్టు తరపున నమోదైన అత్యంత దారుణమైన రికార్డు.
కెప్టెన్ రిషబ్ పంత్ వ్యూహాత్మక లోపాలు..
ఈ పరాభవానికి కెప్టెన్ రిషబ్ పంత్ నిర్ణయాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్ బ్యాటర్లు ఇద్దరూ ఎడమచేతి వాటం ఆటగాళ్లు కావడంతో ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన మార్క్రామ్ను ముందే రంగంలోకి దించాల్సింది. కానీ పంత్ ఏడవ ఓవర్లో ఆయుష్ బదోనీని తీసుకువచ్చి తప్పు చేశాడు. మార్క్రామ్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడిని బ్యాటర్లు కుదురుకున్నాక బౌలింగ్కు దించడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం ఉన్న మార్క్రామ్, బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న సమయంలో బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది.
లక్నో జట్టులో అత్యంత ఖరీదైన ఓవర్లు..
మార్క్రామ్ వేసిన ఈ 32 పరుగుల ఓవర్ లక్నో బౌలర్లలో అగ్రస్థానంలో నిలిచింది. గతంలో రవి బిష్ణోయ్ (27 పరుగులు), ఆవేష్ ఖాన్ (26 పరుగులు) వంటి బౌలర్లు ఖరీదైన ఓవర్లు వేసినప్పటికీ, మార్క్రామ్ ఆ రికార్డులన్నింటినీ చెరిపివేసి అప్రతిష్టను తన ఖాతాలో వేసుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..