దేశంలో పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో వేగంగా పెరుగుతున్న ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు ఐసీఎమ్ఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నేతృత్వంలోని ‘లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్’ కన్సార్టియం ఒక కీలక విధాన పత్రాన్ని విడుదల చేసింది. “భారతదేశంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వాతావరణాన్ని ప్రోత్సహించడం” అనే శీర్షికతో రూపొందించిన ఈ నివేదికను నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం. శ్రీనివాస్ ఆవిష్కరించారు. అధికారిక గణాంకాల ప్రకారం 5-19 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా.. బాల్య ఊబకాయం భారంలో 11 శాతానికి పైగా వాటా మన దేశానిదే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని నివారించేందుకు ఈ విధాన పత్రం ఐదు ముఖ్యమైన సీఫార్సులను ప్రతిపాదించింది. కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధికంగా ఉండే జంక్ ఫుడ్ ప్రకటనలపై చట్టపరమైన కఠిన నిబంధనలు విధించాలని, ప్యాక్ చేసిన ఆహారాలపై స్పష్టమైన ‘ఫ్రంట్-ప్యానెల్ పోషకాహార లేబుళ్లను’ తప్పనిసరి చేయాలని సూచించింది. పాఠశాలల క్యాంటీన్లలో జంక్ ఫుడ్ను అరికట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందుబాటులోకి తేవడానికి ‘NEAT-S’ టూల్కిట్ను రూపొందించారు. అలాగే జంక్ ఫుడ్, చక్కెర పానీయాలపై ప్రత్యేక ‘ఆరోగ్య పన్ను’ విధించడంతో పాటు, ఆయుష్మాన్ భారత్ వంటి జాతీయ కార్యక్రమాలతో ఈ చర్యలను అనుసంధానించాలని నివేదిక స్పష్టం చేసింది. ఈ బృహత్తర కార్యక్రమానికి యూనిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ, FSSAI వంటి సంస్థలు మద్దతు ఇస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కెమెరామెన్కి బంపరాఫర్.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే
Cyber Crime:పార్శిల్ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!