ఆకతాయిల ఆగడాలను అరికట్టే పోలీసులనే కొందరు ఆటపట్టిస్తున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. దమ్మపేట పోలీసులతో పాటు గ్రామస్తులకు కూడా ఈ వింత అనుభవం ఎదురైంది.
ఇటీవల దొంగనోట్ల సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు నిందితుల కోసం అశ్వారావుపేట పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో దమ్మపేట మండలం లచ్చపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిందితులుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో, అదే గ్రామంలోని చెరువులో 500 రూపాయల నోట్లు కట్టలుగా, కొన్ని చింపివేసిన నోట్లు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామ పరువు దెబ్బతింటుందని, ఇంకా గ్రామంలో దొంగనోట్ల ముఠా ఉండొచ్చని అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని నోట్లను పరిశీలించారు. అయితే అవి అసలు నోట్లు కాకుండా చిన్నపిల్లలు ఆడుకునే చెక్లెట్ కాగితాలుగా గుర్తించారు.
దీంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదంతా ఆకతాయిల పనేనని పోలీసులు భావిస్తూ, వారిని త్వరలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.




