ప్రపంచంలోని అగ్రగామి బ్యాంకింగ్ సంస్థలలో ఒకటైన జేపీమోర్గాన్ చేజ్కు సంబంధించి ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. కార్పొరేట్ ప్రపంచంలో అధిక వేతనాలు, ప్రతిష్ట వెనుక దాగి ఉన్న వేధింపుల సంస్కృతిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారి తీసింది. అమెరికాలోని న్యూయార్క్ కౌంటీ సుప్రీం కోర్టులో దాఖలైన ఈ దావాలో సీనియర్ మహిళా బాస్ తనపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, జాత్యహంకార వ్యాఖ్యల చేసినట్లు ఆరోపణలు చేస్తూ ఒక జూనియర్ పురుష ఉద్యోగి ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు ప్రకారం 2024 ప్రారంభంలో ఇద్దరూ కలిసి పనిచేయడం ప్రారంభించిన కొద్దికాలానికే, ఆ మహిళా అధికారి అనుచిత ప్రవర్తన మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. బాధితుడు ఆమె ఆహ్వానాలను తిరస్కరించడంతో, తన కెరీర్ను నాశనం చేస్తానని బెదిరించిందని దావాలో పేర్కొన్నాడు. కాలక్రమేణా పరిస్థితులు మరింత తీవ్రమై, మత్తుమందులు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా బాధితుడి కుటుంబంపై అవమానకర వ్యాఖ్యలు చేసి, జాత్యహంకార పదజాలాన్ని ఉపయోగించినట్లు ఫిర్యాదు పేర్కొంది.
ఇక పదోన్నతులు, బోనస్ల కోసం తన కోరికలను తీర్చాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ వేధింపులు భరించలేని స్థాయికి చేరుకోవడంతో, అతను యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ, తగిన చర్యలు తీసుకోలేదని, బదులుగా తనను కంపెనీ సిస్టమ్స్ నుండి తొలగించి బలవంతపు సెలవుపై పంపినట్లు తెలిపాడు. అయితే జేపీమోర్గాన్ చేజ్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తమ అంతర్గత విచారణలో ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఫిర్యాదుదారు విచారణకు సహకరించలేదని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు న్యాయపరమైన విచారణలో కొనసాగుతుండగా, ఇది కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల భద్రత, ఫిర్యాదు వ్యవస్థల విశ్వసనీయతపై కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి