
James Neesham : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయినా, ఆ జట్టు ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ (James Neesham) తన పోరాట పటిమతో అందరినీ ఆకట్టుకున్నాడు. బౌలింగ్లో 4 ఓవర్లు వేసి 46 పరుగులు ఇచ్చినప్పటికీ, 3 కీలక వికెట్లు తీసి టీమిండియాను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే ప్రస్తుతం నీషమ్ తన ఆట కంటే కూడా సోషల్ మీడియాలో చేసిన ఒక ఘాటు కామెంట్తో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. తనకి రావాల్సిన జీతం ఇవ్వలేదంటూ ఒక క్రికెట్ టీమ్ మేనేజ్మెంట్ను బహిరంగంగా నిలదీశాడు నీషమ్.
అసలేం జరిగింది?
నేపాల్ ప్రీమియర్ లీగ్(NPL)లోని పోఖారా ఎవెంజర్స్ అనే జట్టుకు జేమ్స్ నీషమ్ గత ఏడాది ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో నీషమ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. దీనిని అభినందిస్తూ పోఖారా ఎవెంజర్స్ టీమ్ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. “మా ఆటగాడు నీషమ్ అద్భుతం” అంటూ పొగిడేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన నీషమ్కు కోపం వచ్చింది. వెంటనే ఆ పోస్ట్ కింద.. “సరే బానే ఉంది.. ఇప్పుడు ఆటగాళ్ల బకాయిలు చెల్లించండి” అంటూ రిప్లై ఇచ్చాడు.
సోషల్ మీడియాలో రచ్చ
నీషమ్ చేసిన ఈ ఒక్క కామెంట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఒక అంతర్జాతీయ స్టార్ ఆటగాడికి కూడా సరైన సమయానికి డబ్బులు ఇవ్వలేదంటే ఆ లీగ్ పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గత సీజన్లో నీషమ్ పోఖారా ఎవెంజర్స్ తరపున 4 మ్యాచ్లాడి 99 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీశాడు. ఆ జట్టు ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయినా, నీషమ్ తన వంతు కృషి చేశాడు. కానీ ఆడినందుకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని మాత్రం మేనేజ్మెంట్ ఎగ్గొట్టినట్లు ఈ కామెంట్తో స్పష్టమైంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) March 10, 2026
ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
నీషమ్ సాధారణంగానే సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాడు. తనదైన శైలిలో సెటైర్లు వేయడంలో అతను దిట్ట. అయితే ఈసారి నేరుగా డబ్బుల గురించి అడగడంతో ఫ్యాన్స్ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. “ఆటగాళ్ల కష్టార్జితాన్ని ఇవ్వకుండా సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకోవడం ఏంటి?” అంటూ పోఖారా ఎవెంజర్స్ టీమ్ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నేపాల్ ప్రీమియర్ లీగ్ వంటి చిన్న లీగ్లలో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల ఆ లీగ్ ప్రతిష్ట దెబ్బతింటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..