
దేశంలో ఐపీఎల్ మేనియా కొనసాగుతుంది.. అదే తరహాలో బెట్టింగ్ కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జరుగుతున్న బెట్టింగ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు జిల్లా పోలీసులు. గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జయరామ్ అనే యువకుడు కమీషన్ ఏజెంట్గా మారి ఆన్ లైన్ వెచ్ సైట్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎంత ఎక్కువ మంది బెట్టింగ్స్ ఆడితే అంత ఎక్కువుగా జయరామ్కు కమీషన్ వస్తుంది. జయరామ్ బెట్టింగ్స్ నిర్వహణపై లాలాపేట పోలీసులు దాడులు నిర్వహించగా పదకొండు మంది బెట్టింగ్ రాయుళ్లు దొరికారు. వీరి వద్ద నుండి లక్షా డెబ్బై ఐదు వేల రూపాయల నగదు, పది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ అంతా కూడా ఆన్ లైన్ లోనే జరుగుతుందని పోలీసులు గుర్తించారు.
ఇక పాత గుంటూరు పీఎస్ పరిధిలోను క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రియాజ్ అనే వ్యక్తితో పాటు మరొ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి డెబ్బై ఐదు వేల రూపాయలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరంతా ఆఫ్ లైన్ లో బెట్టింగ్స్ వేస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఫోర్, సిక్స్, బౌల్డ్ ఇలా ప్రతి అంశంలోనూ పందెలు కాస్తునట్లు పోలీసులు తేల్చారు.
ఈ రెండు ఘటనల్లో కలిసి దాదాపు పదిహేను మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుండి సుమారు రెండు లక్షల రూపాయల నగదు, పదమూడు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఎవరూ బెట్టింగ్ మోజులో పడొద్దని.. దాని వల్ల డబ్బులు పోవడం తప్పితే రావడం ఉండదని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆన్ లైన్ యాప్స్ వాళ్ళ కమీషన్ కోసమే బెట్టింగ్స్ నిర్వహిస్తాయని.. బెట్టింగ్ చట్టరిత్యానేరమని ఎవరైనా బెట్టింగ్స్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.