Railway Smart Tracks: వేగంగా వెళ్తున్న రైలులో అకస్మాత్తుగా కుదుపులు.. పట్టాల నుంచి వచ్చే డగడగ శబ్దాలు.. ముఖ్యంగా వంతెనలు, క్రాసింగ్లు దాటేటప్పుడు వచ్చే ఆ కుదుపుల వల్ల నిద్ర భంగం కావడం ప్రయాణికులకు అనుభవమే. అయితే, అన్నీ కుదిరితే త్వరలోనే ఆ చిక్కులన్నీ కనుమరుగు కానున్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదించిన కొత్త టెక్నాలజీతో మీ ప్రయాణం మరింత సుఖవంతం కానుంది.
బరువు తక్కువ.. సామర్థ్యం ఎక్కువ
- రైల్వే ట్రాక్లలో ఇప్పటివరకు వాడుతున్న ఇనుము, కాంక్రీట్ స్లీపర్లకు బదులుగా ‘కంపోజిట్ స్లీపర్లను’ ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
- బలం: ఇవి తక్కువ బరువున్నా, ఒక చదరపు సెం.మీ.పై సుమారు 700 కిలోల లోడ్ను మోయగలవు.
- కుషనింగ్: వీటిలో ఉండే మెరుగైన కుషనింగ్ వల్ల రైలు వెళ్తున్నప్పుడు వైబ్రేషన్స్ (కుదుపులు) చాలా తక్కువగా ఉంటాయి.
- నిర్వహణ: వీటి నిర్వహణ ఖర్చు తక్కువ, మరమ్మతులు కూడా చాలా తేలిక. ముఖ్యంగా బ్రిడ్జ్లు, క్రాసింగ్ల వద్ద వీటిని ఎక్కువగా వాడనున్నారు.
ఏఐ (AI)తో స్మార్ట్ మానిటరింగ్
- రైలు పట్టాల భద్రతను పర్యవేక్షించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను రంగంలోకి దించుతున్నారు. ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
- మైక్రో టెస్టింగ్: పట్టాలలో ఉండే అతి సూక్ష్మమైన చీలికలను సైతం గుర్తించడానికి ‘మాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్’ విధానాన్ని అమలు చేస్తారు.
- గ్రౌండ్ పెనెట్రేషన్ రాడార్ (GPR): ఏఐ పరికరాలు అమర్చిన ఇన్స్పెక్షన్ వాహనాలు పట్టాల కింద నేల గట్టిదనాన్ని విశ్లేషిస్తాయి. ఎక్కడైనా పట్టా దెబ్బతిన్నా లేదా నేల కుంగినా ఏఐ ముందే హెచ్చరికలు జారీ చేస్తుంది.
ప్రయాణికులకు కలిగే ప్రయోజనం:
ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే రైలు ప్రమాదాలను ముందే నివారించవచ్చు. అంతేకాకుండా, ట్రాక్ సమస్యల వల్ల రైళ్లు ఆలస్యంగా నడిచే పరిస్థితి తగ్గి, ప్రయాణం వేగంగా, సాఫీగా సాగుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి