బంగారం, వెండి ధరలు మరింత చౌకగా మారనున్నాయా..? రాబోయే వారంలో ధరలు మరింత తగ్గనున్నాయా..? అంటే అవుననే వార్తలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. గత వారం రోజులుగా పసిడి ధరలు పడిపోతూ వస్తోన్నాయి. దీంతో రాబోయే వారంలో కూడా పతనం కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తారు. రాబోయే వారంలో గోల్డ్,సిల్వర్ ధరలు ఒత్తిడిలో కొనసాగవచ్చని అంటున్నారు. ఇందుకు అనేక కారణాలు కూడా చెబుతున్నారు. ఫెడ్ సమావేశం, యూఎస్-ఇరాన్ మధ్య చర్చలు, డాలర్ బలపడటం వల్ల గోల్డ్ రేట్లలో పతనం చూడవచ్చని అభిప్రాయపడుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలపై ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో బంగారం ధరలపై దీని ప్రభావం పడే అవకాశముందని అంటున్నారు.
ఉద్రిక్తతలు పెరిగితే..
ఇక డాలర్ బలంగా ఉండి అంతర్జాతీయంగా ఉద్రిక్తలు తగ్గితే గోల్డ్ రేట్లు భారీగా తగ్గే అవకాశముంది. ఇక వెండి ధరల్లో కూడా అస్థిరత కొనసాగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అయితే కేంద్ర బ్యాంకులు మృదువైన సంకేతాలు ఇచ్చినా లేదా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినా పసిడి ధరలు పుంజుకోవచ్చని అంటున్నారు. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గితే బంగారం, వెండి ధరలు భారీగా కుప్పకూలే అవకాశముందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఉద్రిక్తతలు తగ్గడం వల్ల బంగారంపై డిమాండ్ తగ్గుతుంది. దీని వల్ల ధరలు తగ్గుతాయని అంటున్నారు. అదే ఉద్రిక్తతలు పెరిగే మాత్రం ధరలు పెరిగే అవకాశముంటుందని నిపుణులు అంచనా వేస్తారు. అలాగే ఇరాన్ హార్ముజ్ జలసంధిపై పరిమితులు విధించింది. అక్కడ ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
కొనసాగుతున్న టెన్షన్
హర్ముజ్ జలసంధి వద్ద టెన్షన్ వాతావరణం ఉండటంతో ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లు దాటాయి. దీని వల్ల ద్రవ్యోల్బణం పెరిగి మార్కెట్ అస్థిరత పెరిగే అవకాశాలుంటాయని చెప్పవచ్చు. ఇక ఏప్రిల్ 29వ తేదీన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం జరగనుంది. వడ్డీ రేట్లు, ఆర్దిక సూచిలు, ద్రవ్యోల్బణంపై ఫెడ్ వైఖరిని బట్టి మార్కెట్లు ప్రభావితం అవుతాయి. ఫెడ్ కఠిన వైఖరి ప్రదర్శిస్తే డాలర్ బలపడుతుంది. దీని వల్ల బంగారం, వెండిపై ఒత్తిడి మరింత పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,040 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,41,200 వద్ద ట్రేడవుతోంది.