ఓవైపు ఎండలు మాడుపగిలేలా చేస్తున్నాయి. ఇంకోవైపు పెట్రోల్ ,డీజిల్ కొరతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల్లో గంటల తరబడి పెట్రోల్ కోసం వేచి చూస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టడం లేదు. డీజిల్ అయితే నోస్టాక్ బోర్డులు పెట్టి నాలుగురోజులు అవుతున్నాయి. దీనికి కారణం యుద్ధమని అంతా అనుకుంటున్నారు. అయితే వెనుక మరో స్కాం జరుగుతోందని జనం అభిప్రాయం. బంకుల యజమానులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు.
ఏపీలో ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల పెట్రోల్, డీజిల్ కోసం ధర్నాలు కూడా సాగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మారుతి సెంటర్లోని ఓ బంకు దగ్గర రైతులు, వాహనదారులు రోడ్డుపై బైఠాయించారు. వెంటనే డీజిల్ కొట్టాలంటూ డిమాండ్ చేశారు రైతులు.. దీంతో పెట్రోల్ బంక్ దగ్గర ధర్నా చేపట్టిన రైతులు, వాహనాదరులకు సర్ది చెప్పి పంపేశారు కొత్తపేట పోలీసులు.
మరోవైపు రాష్ట్రంలో డీజిల్ ,పెట్రోల్ కొరత పై మంత్రి నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణమే రాష్ట్రంలో ఉన్న అన్ని పెట్రోల్ బంకులకు డీజిల్, పెట్రోల్ సరఫరా చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో అన్ని బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు. అంతేకాదు డిజిల్, పెట్రోల్ కృత్రిమ కొరత సృస్టించి, బ్లాక్ మార్కెట్ నడిపించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరాయి ఆయిల్ కంపెనీ ప్రతినిధులు. ప్యానిక్లో వాహనదారులు అవసరమైన దానికన్నా ఎక్కువ కొనుగోలు చేస్తున్నారన్నారు మంత్రి.
ఇదిలా ఉండా రాష్ట్రంలో ఇంధన కొరత నెలకొనడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన కొరతపై అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకులకు క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేయడంపై HPCL, IOCL, BPCL ప్రతినిధులను ఆయన నేరుగా ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలు, ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.