ఆధునిక పోషకాహార శాస్త్రం నుంచి ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానం వరకు, పండ్లను ఎప్పటినుంచో అత్యంత స్వచ్ఛమైన, పోషక విలువలతో కూడిన ఆహారంగా పరిగణిస్తున్నారు. భారతీయ సంప్రదాయ వైద్యంలో ఆహారం అంటే కేవలం కేలరీలు లేదా పోషకాలు మాత్రమే కాదు.. అది జీర్ణక్రియ, శరీర సమతుల్యత, మానసిక స్థితి, సంపూర్ణ ఆరోగ్యంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. పండ్లలో సహజంగా విటమిన్లు, ఖనిజాలు, నీటి శాతం, పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల వాటిని “సాత్విక ఆహారం”గా పేర్కొంటారు. ఇవి శరీరానికి తేలికగా ఉండి, శక్తిని పెంచుతూ, మనసుకు స్పష్టతను అందిస్తాయని నమ్మకం. అయితే ఆయుర్వేదం ఒక ముఖ్యమైన విషయాన్ని గట్టిగా చెబుతుంది.. “ఏం తింటున్నామో ఎంత ముఖ్యమో, ఎప్పుడు తింటున్నామో కూడా అంతే ముఖ్యం.” సరైన సమయంలో తినకపోతే, ఆరోగ్యకరమైన ఆహారమే కొన్నిసార్లు జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అందుకే పండ్లను ఎప్పుడు తినాలి అనే విషయం ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాధాన్యతను పొందింది.