Fan Fight Video : ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఇకానా స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్ కేవలం క్రికెట్ మైదానంలోనే కాదు, గ్యాలరీలో కూడా రచ్చ లేపింది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్న సమయంలో స్టాండ్స్లో ఉన్న ఇద్దరు అభిమానులు ఒకరినొకరు చావబాదుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
స్టేడియంలో ఏం జరిగింది?
ఐపీఎల్ 32వ మ్యాచ్ లక్నో, రాజస్థాన్ జట్ల మధ్య జరుగుతుండగా గ్యాలరీలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఇద్దరు వ్యక్తులు ఏదో విషయంలో గొడవ పడి, అది కాస్తా భౌతిక దాడికి దారితీసింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి మరో వ్యక్తిని పై వరుస నుంచి కింద వరుసలోకి బలంగా నెట్టేశాడు. కిందపడ్డ వ్యక్తి మళ్ళీ లేచి వచ్చి ఎదుటివాడిని లాగి తన్నాడు. అంతటితో ఆగకుండా కాలి చెప్పులతో కూడా కొట్టుకున్నారు. పక్కనే ఉన్న మిగతా ప్రేక్షకులు భయంతో పక్కకు తప్పుకోగా, ఒక వ్యక్తి సెక్యూరిటీని పిలవమని కేకలు వేయడం వీడియోలో వినిపించింది.
రాజస్థాన్ ఘనవిజయం
ఇక మైదానంలో ఆట విషయానికొస్తే.. రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల తేడాతో లక్నోపై అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 159 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 43 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో 160 పరుగుల లక్ష్యం లక్నోకు కష్టంగా మారింది. లక్నో జట్టు కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ 55 పరుగులు చేసినా మిగిలిన వారు ఘోరంగా విఫలమయ్యారు.
లక్నో బ్యాటర్ల వైఫల్యం
లక్నో జట్టుకు హోమ్ గ్రౌండ్ లో ఇది పెద్ద అవమానం. కెప్టెన్ రిషబ్ పంత్, ఆయుష్ బదోని, ఎయిడెన్ మార్క్రమ్ వంటి కీలక ప్లేయర్లు డకౌట్ అవ్వడం అభిమానులను నిరాశపరిచింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో చెలరేగగా, నండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. జడేజా తన ఆల్ రౌండ్ ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.
A fight broke out in the stands during an IPL match at Ekana stadium in Lucknow, UP. pic.twitter.com/ZNvmItxRPN
— Piyush Rai (@Benarasiyaa) April 23, 2026
వైరల్ అవుతున్న వీడియో
ఈ గొడవను పక్కనే కూర్చున్న ఒక ప్రేక్షకుడు తన మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. లక్నో యజమాని సంజీవ్ గోయెంకా, రిషబ్ పంత్ ల ఫోటోలు ఒకవైపు వైరల్ అవుతుంటే, మరోవైపు గ్యాలరీలో జరిగిన ఈ గొడవ ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ని నెగటివ్ గా మార్చేలా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తనపై పోలీసులు, స్టేడియం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..