Headlines

CSEAM ప్రకటనలపై మెటా ఇండియా అధికారికి NCPCR మరోసారి సమన్లు


సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్‌లో బాలల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ (CSEAM) ప్రకటనలు కనిపించాయన్న ఆరోపణలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) విచారణను కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంలో మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, హెడ్‌కు కమిషన్ మరోసారి సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. CSEAMకు సంబంధించిన ప్రకటనలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాయంటూ BBC Eye ప్రచురించిన కథనాన్ని NCPCR జూలై 3న సుమోటోగా స్వీకరించింది. దీనిపై మెటా ప్లాట్‌ఫామ్స్‌ ఇన్‌క్‌కు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల తర్వాత మెటా సంస్థ కమిషన్‌కు తన వివరణను సమర్పించింది.

అయితే ఈ సమాధానంతో సంతృప్తి చెందని NCPCR.. ఆరోపణలపై వాస్తవాలను నిర్ధారించేందుకు అధికారిక విచారణ చేపట్టాలని నిర్ణయించింది. విచారణలో భాగంగా మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, హెడ్‌ను సెప్టెంబర్ 9న హాజరుకావాలని ఆదేశించింది. తాజాగా మరోసారి సమన్లు జారీ చేస్తూ సెప్టెంబర్ 16న కమిషన్ ఎదుట హాజరుకావాలని కోరింది.

మెటా పాలసీలో మార్పులు

NCPCR సమన్ల నేపథ్యంలో మెటా తన చైల్డ్ అబ్యూస్ కేసుల రిపోర్టింగ్ విధానంలో మార్పులు చేసినట్లు సమాచారం. ఇకపై ఇలాంటి కేసులను భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు కూడా నివేదించడం ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆగస్టులో CSAM, డీప్‌ఫేక్ కంటెంట్‌కు సంబంధించి, అలాగే ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన కొన్ని లోపాలపై మెటా ప్రతినిధులు భారత అధికారులకు క్షమాపణలు చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మెటా వ్యవహారంపై ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. మెటా సంస్థలను సాధారణ ‘ఇంటర్మీడియరీ’ నిర్వచనం కింద పరిగణించలేమని స్పష్టం చేసినట్లు తెలిపారు. కంటెంట్‌ను ఎవరికి చేరాలో ఎంపిక చేసే విధానంపై కూడా అధికారులు ప్రశ్నలు లేవనెత్తినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఐటీ చట్టంలోని ‘సేఫ్ హార్బర్’ రక్షణ వర్తింపుపై కూడా చర్చ జరిగినట్లు వెల్లడించారు.

అంతేకాకుండా, కొన్ని రకాల కంటెంట్‌ను బూస్ట్ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినట్లు మెటా ప్రతినిధులు అంగీకరించారని, అనంతరం జరిగిన తప్పిదాలకు వారు క్షమాపణలు చెప్పి విచారం వ్యక్తం చేశారని ఆ అధికారి పేర్కొన్నారు.

క్యాప్‌జెమినీ కేసులోనూ NCPCR విచారణ

ఇదిలా ఉండగా, మరో కేసులో బెంగళూరులోని క్యాప్‌జెమినీ సంస్థ నిర్వహిస్తున్న డే కేర్ సెంటర్‌లో బాలలపై దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై కూడా NCPCR చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో క్యాప్‌జెమినీ వైస్ ప్రెసిడెంట్‌ను కమిషన్ సమన్లు జారీ చేసి విచారణకు పిలిచింది. ఈ కేసులో విచారణను సెప్టెంబర్ 16న నిర్వహించనున్నట్లు NCPCR తెలిపింది. ఆరోపణలపై వాస్తవాలను పరిశీలించి, బాధ్యత ఎవరిదనే అంశాన్ని నిర్ధారించనున్నట్లు కమిషన్ వెల్లడించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *