హైదరాబాద్, మే 3: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) 12వ తరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. అందిన సమాచారం మేరకు మే నెల మూడవ వారంలో ఫలితాలను వెల్లడించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 10వ తరగతి ఫలితాలను వెల్లడించిన సీబీఎస్సీ బోర్డు ఈ మేరకు 12వ తరగతి ఫలితాలు కూడా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.12వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో చూడవచ్చు. వెబ్సైట్తో పాటు ఉమాంగ్ (UMANG) యాప్, డిజిలాకర్ (DigiLocker) ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధులు ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణత పొందినట్లు బోర్డు ప్రకటిస్తుంది. ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వారు కంపార్ట్మెంట్ కేటగిరీ కిందకు వస్తారు. రెండు కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు వచ్చే ఏడాది మళ్లీ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 18 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. గత సంవత్సరం, బోర్డు మే 13న ఫలితాలను ప్రకటించింది. డిజిటల్ మార్కింగ్ విధానంలో తప్పులు దొర్లాయంటూ వస్తున్న వదంతులపై పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ స్పందించారు. ఆన్లైన్ మూల్యాంకన ప్రక్రియ ఎటువంటి సమస్యలు లేకుండా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. సీబీఎస్సీ బోర్డు విద్యార్ధుల జవాబు పత్రాలను తనిఖీ చేయడానికి ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని ఈ ఏడాదే మొదటిసారిగా ఉపయోగిస్తుందని, ప్రస్తుతం మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతోందని, తుది పనులు పూర్తి చేసిన తర్వాత మే మూడవ వారంలో ఫలితాలను ప్రకటించాలని బోర్డు భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.