విద్యార్థుల తమ ఉన్నత చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ బ్యాంకుల నుంచి తీసుకుంటూ ఉంటారు. ఈ రుణానికి ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తూ ఉంటాయి. ఇక కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఎలాంటి గ్యారంటీ లేకుండా తక్కువ వడ్డీతో లోన్ అందిస్తోంది. అయితే తాజాగా విద్యా రుణాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోగా బ్యాంకులు మంజూరుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు బ్యాంకులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది నాటికి రుణాల పంపిణీ వేగాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టకుంది. అంతేకాకుండా బ్యాంకులు వ్యక్తిగతంగా 50,000 కళాశాలలను సందర్శించి అక్కడ శిబిరాలను ఏర్పాటు చేస్తాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
విద్య రుణాలకు సంబంధించి విద్యా శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఒక రోడ్మ్యాప్ను రూపొందిస్తున్నాయి. రాష్ట్ర విద్యా శాఖలు, బ్యాంక్ కమిటీలు, ఉన్నత విద్యా సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. విద్యార్థులు రుణాలు పొందడాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ కొత్త రోడ్ మ్యాప్ తీసుకొస్తున్నారు. 10 రోజుల్లోగా రుణం ఆమోదించడం ఇందులో ప్రధానమైనదిగా చెప్పవచ్చు.
విద్యార్థులకు అక్కడికక్కడే రుణాలు అందించేందుకు, సుమారు 50,000 ప్రధాన కళాశాలలు, సంస్థలలో బ్యాంకులు శిబిరాలను ఏర్పాటు చేయనున్నాయి. దీని వల్ల విద్యార్థులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ప్రస్తుతం పూచీకత్తు లేని రుణ పరిమితి 7.5 లక్షలగా ఉంది. అయితే 20 లక్షలు వరకు దీనిని పెంచాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజన పథకం కింద విద్యా రుణాలపై (2024-31) మధ్య వడ్డీ రాయితీ కోసం 3,600 కోట్ల రూపాయల బడ్జెట్ కేంద్రం కేటాయించింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో 39,000 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,80,000 దరఖాస్తులు ఆమోదించారు. ప్రస్తుతం నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ కింద విద్యా రుణాల క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ పథకం రూ.7.5 లక్షల వరకు ఉన్న రుణాలపై 75% గ్యారెంటీని అందిస్తోంది. డిసెంబర్ 2025లో, దీనిని రూ.20 లక్షలకు పెంచాలని ఒక పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది.




