Headlines

Andhra Pradesh: నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్‌.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..

Andhra Pradesh: నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్‌.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..


భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలు, అనుమానాలు చివరకు ఇద్దరు పసిపాపల ప్రాణాల మీదకు తెచ్చాయి. తనతో కాపురానికి రావట్లేదన్న అక్కసుతో ఒక తండ్రి కనీస మానవత్వం మరిచి దారుణానికి ఒడిగట్టాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగించి, తానూ తాగాడు. ఈ దారుణ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన 10 ఏళ్ల కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందగా, 8 ఏళ్ల కుమారుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాదకర సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో తీవ్ర కలకలం రేపింది. బాపట్ల జిల్లా చీరాల సాయికాలనీకి చెందిన ప్రవళిక, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు చెందిన కొరిశపాటి విజయకుమార్‌లు 12 ఏళ్ల క్రితం చీరాలలోని వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కాలేజీలో చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 10 ఏళ్ల కూతురు ఆద్య, 8 ఏళ్ల కుమారుడు సుప్రీత్ ఉన్నారు. అయితే విజయకుమార్ ఎలాంటి పని చేయకుండా నిత్యం భార్యపై అనుమానం పెంచుకుని వేధించేవాడు. భర్త వేధింపులు తాళలేక ప్రవళిక ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చినా విజయకుమార్ తీరులో ఎలాంటి మార్పూ రాలేదు. దీంతో విసిగిపోయిన ప్రవల్లిక పిల్లలను భర్త వద్దే వదిలేసి, గత మూడు నెలలుగా ఒంగోలులోని స్త్రీశక్తి సదన్ హోమ్‌లో ఉంటుంది.

కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి..

ఈ క్రమంలో పిల్లలను నవోదయ స్కూల్‌లో చేర్పించేందుకు ఈ నెల 18న ప్రవళిక భర్తను సంప్రదించింది. విజయకుమార్ పిల్లలకు పుస్తకాలు కొనిచ్చిన అనంతరం, భార్యను తిరిగి కాపురానికి రమ్మని కోరాడు. ఆమె అందుకు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విజయకుమార్.. ఈ నెల 19న ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగించి, తానూ తాగాడు. ఆ తర్వాత పిల్లలను తీసుకువెళ్లి స్త్రీశక్తి సదన్‌లో ఉన్న ప్రవళిక వద్ద వదిలేశాడు. తీవ్ర అస్వస్థతకు గురైన పిల్లలను గమనించిన తల్లి వెంటనే ఒంగోలు రిమ్స్‌కు తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఎగ్మోర్ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ చిన్నారి ఆద్య మృతి

చెన్నై ఎగ్మోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 10 ఏళ్ల చిన్నారి ఆద్య కన్నుమూసింది. బాలుడు సుప్రీత్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. మరోవైపు పిల్లలకు విషమిచ్చి తాను కూడా తాగిన తండ్రి విజయకుమార్ ఒంగోలు జీజీహెచ్‌‌లో చికిత్స పొందుతున్నాడు. కుమార్తె ఆద్య మృతి చెందడంతో తల్లి ప్రవళిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు తాలూకా పోలీసులు విజయకుమార్‌పై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు ఒంగోలు తాలూకా సీఐ విజయ్‌కృష్ణ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *