Headlines

Andhra Pradesh: కొత్తగా పింఛన్ అప్లై చేసుకునేవారికి గుడ్ న్యూస్.. ఈ డాక్యుమెంట్స్ లేకున్నా ఓకే..


ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన పేదలకు పింఛన్లు అందించే ప్రక్రియ మరింత సులభతరమైంది. ఎన్టీఆర్ భరోసా కింద కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి ఎదురవుతున్న పెద్ద అడ్డంకిని తొలగిస్తూ ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు నగరాలు, పట్టణాల్లో నివసించేవారు దరఖాస్తు చేయాలంటే ఇంటి పన్ను అసెస్‌మెంట్ రశీదు తప్పనిసరిగా జతచేయాల్సి వచ్చేది. సొంత ఇల్లు లేనివారు, అద్దె ఇళ్లలో ఉండేవారు ఈ నిబంధన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో స్పందించిన యంత్రాంగం, వెబ్‌సైట్‌లో ఈ షరతును తొలగించింది. రేపటి నుంచి ఈ ఆంక్షలు లేకుండానే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

20 రోజుల టార్గెట్.. వచ్చే నెల నుంచే చేతికి నగదు..

దరఖాస్తులు మొదలైన తొలిరోజే రికార్డు స్థాయిలో దాదాపు 75 వేల మంది సచివాలయాలకు పోటెత్తారు. రద్దీ వల్ల సర్వర్లు మొరాయించినా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుల దాఖలుకు ఈ నెల 14వ తేదీ వరకు అవకాశం కల్పించారు. వచ్చిన అప్లికేషన్లను 20 రోజుల్లోగా క్షేత్రస్థాయిలో విచారించి.. అక్టోబర్ 1 నాటికి కొత్త కార్డుదారులకు మొదటి విడత సొమ్మును చేతికి అందించాలని ఆదేశాలు వెళ్లాయి.

ఆధార్ ఈ-కేవైసీకి గ్రీన్ సిగ్నల్

మరోవైపు సంక్షేమ పథకాల్లో బోగస్ లబ్ధిదారులను ఏరివేసేందుకు ఆధార్ ఈకేవైసీ విధానాన్ని చట్టబద్ధం చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక గెజిట్ విడుదల చేసింది. సచివాలయాలు, మీ సేవ, సదరం క్యాంపులలో బయోమెట్రిక్ ఆధారిత సేవల నిర్వహణకు సంబంధించి కేంద్ర నిబంధనల ప్రకారం రాష్ట్రం పూర్తి వివరణలను అధికారికంగా వెల్లడించింది. దీనివల్ల అర్హులైన వారికే నేరుగా ప్రభుత్వ ప్రయోజనాలు దక్కనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *