
ఏపీలోని మందుబాబులకు శుభవార్త. మద్యం ధరలు త్వరలో తగ్గనున్నాయి. ఈ మేరకు ఎక్సైశాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. త్వరలో కేబినెట్ ఆమోదానిక ఈ ఫైల్ను పంపేందుకు సిద్దమవుతోంది. కేబినెట్ ఆమోదం తర్వాత తగ్గిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రీమియం లిక్కర్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ప్రీమియం బాండ్లు, విదేశీ లిక్కర్ బ్రాండ్ల ధరలను తగ్గించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ప్రీమియం బ్రాండ్ల లిక్కర్ ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏపీలో వీటి సేల్స్ తక్కువగా ఉంటున్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. దీంతో సేల్స్ పెరిగేలా చేసేందుకు ప్రీమియం బ్రాండ్ల ధరలను తగ్గించనుందని తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని సమాచారం.
త్వరలోనే కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఉదాహరణకు చూస్తే ప్రీమియం విదేశీ లిక్కర్ బాటిళ్ల ధర తెలంగాణలో రూ.22 వేలుగా ఉండగా.. ఏపీలో వీటి ధర రూ.25 వేలుగా ఉంది. బ్రాండ్ను బట్టి తెలంగాణలో కంటే ఏపీలో ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కొనుగోలు చేసేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు. దీంతో ప్రీమియం మందు బాటిళ్ల కొనుగోళ్లు పెరగాలంటే ధరలు తగ్గించడమే మార్గమని ఎక్సైజ్ శాఖ భావించింది. దాదాపు 20 ప్రీమియం లిక్కర్ బ్రాండ్ల ధరలను తగ్గించాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతోంది. ఒక్కో బ్రాండ్ బాటిల్పై దాదాపు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఇవి తగ్గనున్నాయి. వీటికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
వైన్ ధరలు కూడా తగ్గింపు
ఇక ప్రీమియం లిక్కర్ ధరలతో పాటు వైన్ ధరలను కూడా తగ్గించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మందుబాబులకు పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం పాలసీని పూర్తిగా మార్చేసింది. మద్యం ధరలను భారీగా తగ్గించింది. దాదాపు 40 బ్రాండ్ల మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రీమియం బ్రాండ్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు వాటిని కూడా తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీని వల్ల మద్యం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. త్వరలోనే కొత్త ధరలను అమల్లోకి తెచ్చే అవకాశం ఉండటంతో మందుబాబులకు ఇది ఎగిరి గంతేసే వార్తగా చెప్పవచ్చు.