ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. పార్టీ ఫిరాయింపుల కేసులో సెప్టెంబర్ 18న తెలంగాణ హైకోర్టు ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించి, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు.. తీర్పు ప్రతులను అసెంబ్లీ స్పీకర్, ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించింది.
తాజాగా దానం నాగేందర్ అనర్హత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2023లో బీఆర్ఎస్ టికెట్పై ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. దీనిని పార్టీ ఫిరాయింపుగా పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సెప్టెంబర్ 18న తీర్పు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయన అనర్హుడని ప్రకటిస్తూ ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ
అనర్హత పై దానం నాగేందర్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉండడంతో ముందుగానే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కెవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ పిటిషన్ పై తమ వాదన వినాలని బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కెవియట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు పై స్టే కోరుతున్న దానం నాగేందర్ పిటిషన్ పై సుప్రీంకోర్టు లో విచారణ పై ఉత్కంఠ నెలకొంది. ఖైరతాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందా, లేక దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..