ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న దివంగత ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాట విని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బెంగళూరులో జరిగిన ఎం.ఎస్.సుబ్బులక్ష్మి 110వ జయంతి వేడుకల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సుబ్బులక్ష్మి సంగీత సేవలను, ఆమె అంకితభావాన్ని కొనియాడారు. కర్ణాటక సంగీతంలో భక్తి భావానికి ఉండే ప్రత్యేక స్థానాన్ని గుర్తుచేస్తూ, భిన్న భాషలు మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలను సంగీతం ఎలా ఒక్కటిగా కలుపుతుందో వివరించారు. సుబ్బులక్ష్మి సాధించిన ఉన్నత శిఖరాల వెనుక ఆమె చూపిన వినయం, కఠిన శిక్షణ, అపారమైన సాధన ఉన్నాయని ప్రశంసించారు.1916 సెప్టెంబరు 16న మధురైలో జన్మించిన ఎం.ఎస్.సుబ్బులక్ష్మి 20వ శతాబ్దపు అగ్రగామి గాయనీమణులలో ఒకరిగా నిలిచారు. తన మధురమైన గాత్రంతో దేశవిదేశాలలో భారతీయ సంగీత వైభవాన్ని చాటిచెప్పారు. 1966లో ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయ కళాకారిణిగా, 1974లో రామన్ మెగసెసే అవార్డు పొందిన తొలి భారతీయ సంగీత విద్వాంసురాలిగా చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ను 1998లో అందుకున్నారు. 2004 డిసెంబరు 11న చెన్నైలో ఆమె కన్నుమూశారు. కాగా, భారతీయ సంగీత దిగ్గజం ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితం త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ప్రముఖ నటి రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ‘MS-A Legacy On Screen’ పేరుతో ఈ బయోపిక్ తెరకెక్కుతుండటం విశేషం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.10 లక్షల లంచం + రోజూ బిర్యానీ = ఏసీబీ షాక్!
నొప్పి తగ్గించే ఇంజెక్షన్, కిక్కిచ్చే మత్తుమందుగా మారిందా ?