Headlines

‘పిరికి జడ్జిగా పిలిపించుకోవడం కంటే చావడమే మేలు’.. తీర్పు ఇస్తూ.. న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు!


ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవి కుమార్ దివాకర్ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఓ హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ వెలువరించిన తీర్పులో.. “పిరికి న్యాయమూర్తిగా పిలిపించుకోవడం కంటే చావడానికైనా సిద్ధం” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మాఫియా, గ్యాంగ్‌స్టర్లు, నేరస్థుల ఒత్తిడికి తాను న్యాయపరమైన విధులను నిర్వహించబోనని స్పష్టం చేశారు.

ముజఫర్‌నగర్‌లో భార్యను సజీవ దహనం చేసిన కేసులో నిందితుడు నదీమ్‌కు న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్ మరణశిక్ష విధించారు. 2018లో జరిగిన ఈ ఘటనలో 23 ఏళ్ల మహిళ తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మరణ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు చెందిన 11 మంది సాక్షులు ప్రతికూలంగా మారినప్పటికీ.. మరణ వాంగ్మూలం ఆధారంగా తీర్పు వెలువడింది. ఈ కేసును అత్యంత అరుదైన వాటిలో అరుదైనదిగా పరిగణిస్తూ మరణశిక్ష విధించారు.

తీర్పులో జడ్జి రవి కుమార్ దివాకర్ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో మాఫియా, గ్యాంగ్‌స్టర్ల ప్రభావంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు దేవుడికి మాత్రమే భయపడాలని నేర్పారని పేర్కొంటూ.. నేరస్థుల భయంతో న్యాయ విధులు నిర్వహిస్తే న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. తనకు మాఫియా, నేరస్థుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. తన కోర్టులో ఉన్న సుమారు 100 తీవ్రమైన కేసులను ఇతర కోర్టులకు బదిలీ చేయడం ద్వారా నేరస్థులకు ప్రయోజనం కలిగించే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా మరింత వివరణ రావాల్సి ఉంది.

అంతేకాకుండా, తీవ్రమైన కేసుల్లో ఫైళ్లను ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేసినప్పుడు కారణాలు స్పష్టంగా ఉండాలని, నేరస్థులు లేదా ప్రభావశీల వ్యక్తులు తమకు అనుకూలమైన కోర్టును ఎంచుకునే పరిస్థితి రాకూడదని ఆయన సూచించారు. తన తీర్పు ప్రతిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని కూడా ఆదేశించారు. ఈ తాజా తీర్పుతో రవి కుమార్ దివాకర్ కోర్టు గత నాలుగు నెలల్లో 11 కేసుల్లో మొత్తం 23 మందికి మరణశిక్ష విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఆయన వ్యక్తం చేసిన ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *