అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్బుత స్కీమ్ తీసుకొచ్చింది. ఫిక్స్డ్ జాబ్ లేనివారు, వాచ్ మెన్లు, పనివాళ్లు, కార్మికులు ఈ పథకంలో చేరవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే ఇందుకు అర్హులు. మీరు నెలకు కేవలం రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లిస్తే చాలు.. మీ వయస్సు 60 ఏళ్ల నిండిన తర్వాత నెలకు రూ.3 వేల పింఛన్ కేంద్రం నుంచి పొందవచ్చు
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత పింఛన్ అందించేందుకు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకం అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ఎప్పటినుంచో అమల్లో ఉండగా.. ఇప్పటికే చాలామంది చేరారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్, పెన్షన్ స్కీమ్ రూపంలో రిటైర్మెంట్ తర్వాత పింఛన్ సౌకర్యం ఉంటుంది. అదే అసంఘటిత రంగంలో పనిచేసేవారికి ఉండదు.
దీంతో అసంఘటిత రంగంలో పనిచేసేవారికి కూడా వృద్దాప్యంలో పింఛన్ అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది. పీఎఫ్, ఈఎస్ఐసీ సదుపాయం లేనివారు ఇందులో చేరడానికి అర్హులు. ఒకసారి ఈ పథకంలో చేరిన తర్వాత 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది.
60 ఏళ్లు దాటాక ప్రతీ ఏడాది పింఛన్ అందుతుంది. ఒకవేళ పింఛన్దారుడు మరణిస్తే భార్యకు పింఛన్ వస్తుంది. వీధి వ్యాపారులు, మేస్ట్రీలు, చెత్త ఏరుకునేవారు, వాచ్ మెన్లు, కూలీలు, వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులు, రిక్షా కార్మికులు లాంటివారు, పక్కా ఉద్యోగం లేనివారు ఇందులో చేరవచ్చు. నెలవారీ ఆదాయం రూ.15 వేల కంటే ఎక్కువ ఉండకూడదు.
మీరు 18 ఏళ్ల వయస్సులో ఈ స్కీములో చేరితే నెలకు రూ.55 ప్రీమియం ఉంటుంది. ప్రభుత్వం అదే మొత్తంలో మీ తరపున ప్రీమియం చెల్లిస్తుంది. 30 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.105, 35 ఏళ్ల వయస్సులో చేరితే రూ.150, 40 ఏళ్ల వయస్సులో చేరితే రూ.200 ఉంటుంది. మీ వయస్సును బట్టి ప్రీమియం నిర్ణయిస్తారు. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.




