Headlines

Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది?.. పీసీబీ అసలు రంగు బయటపెట్టిన మాజీ కెప్టెన్


Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలపై ఆ దేశ మాజీ కెప్టెన్, సెలెక్షన్ కమిటీ మాజీ సభ్యుడు మిస్బా ఉల్ హక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డులో స్థానిక కోచ్‌లకు జరుగుతున్న వివక్షను, అర్థం పర్థం లేని మార్పులను ఎండగడుతూ తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. పాకిస్థాన్ టీవీ షోలో పాల్గొన్న మిస్బా ఉల్ హక్ పీసీబీ అంతర్గత వ్యవహారాలపై విమర్శల వర్షం కురిపించారు. పాక్ క్రికెట్‌లో స్వదేశీ కోచ్‌లను, విదేశీ కోచ్‌లను చూసే కోణంలో తీవ్ర వ్యత్యాసం ఉందనే చేదు నిజాన్ని బయటపెట్టారు. స్వదేశీ కోచ్‌లు ఏ చిన్న పొరపాటు చేసినా వారిపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ వేధింపులకు గురిచేస్తారని, అదే విదేశీ కోచ్‌లు జట్టును దారుణంగా ఓడించినా వారికి పూర్తి మినహాయింపులు ఇస్తారని మండిపడ్డారు. తనకు విదేశీ కోచ్‌లపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, వ్యవస్థలో వేళ్లూనుకున్న ఈ పక్షపాత ధోరణే తనను తీవ్రంగా కలిచివేసిందని స్పష్టం చేశారు.

సిరీస్ మధ్యలోనే ఏడుగురు ఆటగాళ్లు, కోచ్‌లపై వేటు

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ 0-2తో వెనుకబడి ఉంది. సెప్టెంబర్ 9 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానున్న తరుణంలో పీసీబీ ఎవరూ ఊహించని దారుణ నిర్ణయం తీసుకుంది. వైస్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ ఆగాతో సహా ఏడుగురు కీలక ఆటగాళ్లను సిరీస్ మధ్యలోనే ఇంటికి పంపించివేసింది. వీరితో పాటు ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లను కూడా బాధ్యతల నుంచి తప్పించింది. సెలెక్షన్ కమిటీలో ఉన్న తనతో కనీసం సంప్రదించకుండా, సమాచారం కూడా ఇవ్వకుండా వన్ సైడ్ నిర్ణయాలు తీసుకోవడంతో అసంతృప్తి చెందిన మిస్బా తన పదవికి వెంటనే రాజీనామా సమర్పించారు.

భయంతో చేసే కాస్మోటిక్ సర్జరీలు పనిచేయవు

జట్టు ప్రదర్శన దెబ్బతిన్న ప్రతిసారీ ఓటములకు గల అసలు కారణాలను అన్వేషించకుండా, పైపైన మార్పులు చేయడం పీసీబీకి అలవాటుగా మారిందని మిస్బా తీవ్రంగా దుయ్యబట్టారు. భయం, తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోయి పీసీబీ చేసే ఇలాంటి కాస్మోటిక్ సర్జరీలు పాక్ క్రికెట్ భవిష్యత్తును ఏమాత్రం మార్చలేవని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులను, ఆటగాళ్ల ప్రదర్శనను శాస్త్రీయంగా విశ్లేషించి సుదీర్ఘ ప్రణాళికలతో ముందుకు వెళ్లాలే తప్ప, ప్రతీసారి ఇలా తొందరపాటు చర్యలకు దిగడం వల్ల జట్టు మరింత దిగజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

దిగజారుతున్న పాక్ క్రికెట్ సిస్టమ్

జట్టులో వస్తున్న ఈ అనాలోచిత మార్పులు, బోర్డు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు పాకిస్థాన్ క్రికెట్ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. జట్టు ఓడిపోయినప్పుడల్లా ఆటగాళ్లను, కోచ్‌లను బలిపశువులను చేయడం పీసీబీకి పరిపాటిగా మారింది. మిస్బా చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం పాక్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *