Headlines

కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..


ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. అంతా బాగానే ఉంది.. ఈ క్రమంలోనే పిడుగులాంటి వార్త.. కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో వరుడు దుర్మరణం చెందాడు.. కొత్త జీవితం పై ఎన్నో కలలు కంటూ పెళ్లి పందిరి సందడి నుంచి బయటపడకముందే ఓ నవ దంపతుల జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. పెళ్లై వారం రోజులు కూడా గడవకముందే రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందడంతో నవవధువు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం కె.రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోసూరు నారాయణరావు అలియాస్ పవన్ (21) ఇంటర్ వరకు చదువుకున్నాడు. నారాయణరావు కుమ్మరి పని, ఇటుకల తయారీ ద్వారా కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. అలాగే నారాయణరావు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ప్రేమికులిద్దరూ ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించుకున్నారు. అనంతరం గత నెల 30న వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ జంటకు విధి వారం రోజులకే చేదు అనుభవాన్ని మిగిల్చింది.

నారాయణరావు ఈ నెల 5 న శ్రీకాకుళం జిల్లా రాపాకలోని బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు తన మేనల్లుడు జగదీష్‌తో కలిసి బైక్ పై వెళ్లాడు. అనంతరం పెళ్లి భోజనాలు చేసి తిరిగి మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా పొందూరు మండలం నర్సాపురం దాటిన తర్వాత ఓ మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. వేగంగా వెళ్లిన బైక్ రోడ్డుపక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణరావు అక్కడికక్కడే మృతి చెందగా, మేనల్లుడు జగదీష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి జగదీష్‌ను అంబులెన్స్‌లో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. బంధువుల పెళ్లికి వెళ్లిన తమ కుమారుడు ఇక తిరిగి రాడనే వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గణేష్, దుర్గతో పాటు భార్య, చెల్లెలు, ఇతర కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ముఖ్యంగా భర్త తిరిగి ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్న నవవధువుకు అతడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలియడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె రోదన చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. వారం రోజుల క్రితం పెళ్లి వేడుకలతో కళకళలాడిన రామచంద్రాపురం గ్రామం ఇప్పుడు యువకుడి ఆకస్మిక మరణంతో విషాదంలో మునిగిపోయింది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొద్ది రోజులకే భర్తను కోల్పోయిన ఆ నవవధువు విషాదం గ్రామస్థులను కలచివేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *