ప్రస్తుతం వరద బాధితులంతా తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. బాధితులకు ‘రిలీఫ్ కార్డులు’ ఇచ్చి బియ్యం, పప్పులు, రొట్టెలు, మంచినీళ్ల బాటిళ్లు ఇస్తున్నారు. ఉచిత సరకుల కోసం ప్రతిరోజూ జనం వరద తెచ్చిన బురద మధ్య బారులు తీరి నిలబడాల్సి వస్తోంది. మరోవైపు, ఇళ్ల శిథిలాల మధ్య ఎక్కడ చూసినా శవాలు కుప్పలుగా కళ్లెదుటే కనిపిస్తూ కలవరపెడుతున్నాయి . దీంతో ఈగలు, పురుగులు పెరిగి అంటువ్యాధులు వ్యాపిస్తాయేమోనని జనం భయంతో వణికిపోతున్నారు. మరో వైపు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉండటంతో అప్రమత్తమైన అధికారులు బాధితులకు కలరా టీకాలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
విరిగిపడిన కొండచరియలు.. చౌలానీ నదికి వరద ముప్పు..!
నేపాల్ లో వరద ప్రమాద హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. భారీ వర్షాల కారణంగా దార్చులా జిల్లాలోని భట్టార్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి చౌలానీ నది ప్రవాహానికి అడ్డుపడ్డాయి. కొండలపై నుంచి రాళ్లు, మట్టి జారి పడి నదీ ప్రవాహం కొంత మేర నిలిచిపోయింది. దీంతో అధికారులు అలర్టయ్యారు. రాళ్లు తొలిగి దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదం ఉందని పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు ఫోన్ అలర్ట్ లు పంపించారు. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలు ఇంకా కోలుకోకముందే.. ఈ కొత్త ముప్పు రావడం ఆందోళనకరంగా మారింది.
తమ ఇళ్లు కొట్టుకుపోయి, కూడబెట్టిన డబ్బంతా పోయింది అంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. రోజువారీ కూలి పనిచేసుకునే తమకు ఇల్లు కట్టే శక్తి లేదని, రేపు ఎలా బతకాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.