ఈ చేప చూడ్డానికి కొర్రమీను చేపలానే ఉంటుంది. కానీ, దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని చెరువుల్లో ఈ చేపలు విపరీతంగా దొరుకుతాయి. కానీ చాలా మంది వీటిని ఫ్రీగా ఇచ్చిన తినరు. కొంతమంది మాత్రమే వీటిని తింటారు. అయితే చాలా మంది వీటిని తినకపోవడానికి కారణం ఏంటి? అసలు వీటి కథేంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
క్యాట్ఫిష్ కథ..
క్యాట్ఫిష్ అనేది మీసాల్లాంటి అవయవాలు ఉండే చేపల సమూహానికి చెందిన పేరు. భారత్లో స్వదేశీ క్యాట్ఫిష్ జాతులు ఉన్నప్పటికీ, విదేశీ జాతి అయిన ఆఫ్రికన్ క్యాట్ఫిష్ కొన్ని ప్రాంతాల్లో పెరుగుతోంది. ఈ జాతి వేగంగా పెరగడం, ఇతర చేపలను తినే స్వభావం కలిగి ఉండటం వల్ల పర్యావరణానికి ముప్పుగా పరిగణిస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు, పర్యావరణ నిపుణుల ప్రకారం, ఆఫ్రికన్ క్యాట్ఫిష్ స్థానిక చేపల జాతులను నాశనం చేసే ప్రమాదం ఉంది. అందుకే ఈ విదేశీ జాతి పెంపకంపై అనేక సందర్భాల్లో ఆంక్షలు విధించారు. అయితే ఈ నిషేధం ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ కోసమే కానీ, క్యాట్ఫిష్ తింటే ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా వ్యాధులు వస్తాయనే కారణంతో కాదు.
ఇది కూడా చదవండి: కొత్త చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. కళ్లు ఉండవ్ కానీ, దీనిది చిన్న కథ కాదు!
ఆరోగ్యానికి హానికరమా?
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పరిశుభ్రమైన నీటిలో పెరిగిన, సురక్షితంగా నిల్వ చేసిన, బాగా వండిన చేపలను తీసుకోవడం సాధారణంగా సురక్షితమే. అయితే కాలుష్యానికి గురైన చెరువులు లేదా మురుగునీటిలో పెరిగిన చేపల్లో హానికర పదార్థాలు ఉండే అవకాశం ఉంది. అలాంటి చేపలను తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఈ ప్రమాదం క్యాట్ఫిష్కే కాదు, అదే నీటిలో పెరిగే ఇతర చేపలకు కూడా వర్తిస్తుంది.
మోసాలకు గురికాకండి
కొన్నిచోట్ల క్యాట్ఫిష్ను కొర్రమీను పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అందువల్ల వినియోగదారులు నమ్మకమైన చేపల మార్కెట్ల నుంచే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. చేప ఏ జాతికి చెందినదో తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన చేపలను ఎంపిక చేసుకోవాలంటే అవి పరిశుభ్రమైన వాతావరణంలో పెరిగాయా, తాజాగా ఉన్నాయా అనే విషయాలను పరిశీలించాలి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ప్రతి ఆరోపణను నమ్మకుండా, అధికారిక సమాచారం, వైద్య నిపుణుల సూచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.