వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు దేశంలోని రైల్వే వ్యవస్థ రూపురేఖలనే మార్చేశాయి. దేశంలో అత్యంత వేగంగా, అత్యాధునిక సదుపాయాలతో ప్రయాణించే ఈ హైస్పీడ్ రైలులో ప్రయాణించడం ఎంతటి అనుభూతినో, దానిని నడిపే వందే భారత్ లోకో పైలట్ ఉద్యోగం కూడా అంతే ప్రతిష్టాత్మకమైనది. భారతీయ రైల్వేలో లోకో పైలట్గా చేరడం ఎలా? వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపే అవకాశం ఎవరికి వస్తుంది? వారికి అందే జీతభత్యాలు, అర్హతలు, ఎంపిక విధానం ఎలా ఉంటుందో చాలా మందికి తెలియవు. వందే భారత్ రైళ్లు సాంప్రదాయ రైళ్ల కంటే వేగంగా ప్రయాణిస్తాయి. ఇందులో సెమీ-హైస్పీడ్ ఆటోమేటిక్ డోర్లు, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్స్, కవచ్ యాంటీ కొలిజన్ సేఫ్టీ సిస్టమ్ ఉంటాయి. అందువల్ల వీటిని నడిపే లోకో పైలట్లకు అత్యంత అప్రమత్తత, నిమిషాల వ్యవధిలో వేగంగా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం ఉండాలి.
విద్యా అర్హతలు
- భారతీయ రైల్వేలో లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఉండాల్సిన ప్రాథమిక అర్హతలు.
- పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- దాంతో పాటు గుర్తింపు పొందిన ఐటీఐలో ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేస్తారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ : సాధారణ సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానంపై పరీక్షలు ఉంటాయి.
కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్: మానసిక సామర్థ్యం, ఏకాగ్రతను పరీక్షించే సైకోలాజికల్ టెస్ట్.
మెడికల్ ఎగ్జామినేషన్: A-1 కేటగిరీ మెడికల్ ఫిట్నెస్ తప్పనిసరి. ముఖ్యంగా దృష్టి లోపాలు ఉండకూడదు.
వందే భారత్ రైలును ఎవరు నడుపుతారు?
ఆర్ఆర్బి ద్వారా నేరుగా ఎంపికైన కొత్త అసిస్టెంట్ లోకో పైలట్లకు వెంటనే వందే భారత్ ఇచ్చేయరు.
- ప్రారంభంలో గూడ్స్ రైళ్లకు అసిస్టెంట్ లోకో పైలట్గా పనిచేయాలి.
- అనుభవాన్ని బట్టి ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రమోషన్ లభిస్తుంది.
- సీనియర్ లోకో పైలట్లలో అత్యుత్తమ ట్రాక్ రికార్డు, సున్నా ప్రమాదాల రికార్డు ఉన్నవారికి ప్రత్యేక మానసిక, సాంకేతిక శిక్షణ ఇచ్చి వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపే బాధ్యతలు అప్పగిస్తారు.
జీతభత్యాలు
వందే భారత్ నడిపే లోకో పైలట్లు సీనియర్ కేటగిరీకి చెందినవారు కావడంతో వారికి వేతనం అత్యధికంగా ఉంటుంది.
ప్రాథమిక వేతనం: సీనియర్ లోకో పైలట్లకు రూ. 35,400 నుండి రూ. 50,000పైనే ఉంటుంది.
అలవెన్సులు: రన్నింగ్ అలవెన్స్, కరువు భత్యం, ఇంటి అద్దె భత్యం, నైట్ డ్యూటీ అలవెన్స్ వంటివి అదనంగా లభిస్తాయి.
మొత్తం చేతికి వచ్చే జీతం: వందే భారత్ లోకో పైలట్లకు అన్ని అలవెన్సులు కలిపి నెలకు రూ.90,000 నుండి రూ.1,20,000 పైనే వేతనంగా అందుతుంది.
భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందడం ఒక ఎత్తయితే, దేశానికే గర్వకారణమైన వందే భారత్ వంటి ఆధునిక రైలును నడపడం ఒక గొప్ప అనుభూతి, హోదా. కష్టపడి రైల్వే ఎగ్జామ్స్ సాధించి, సుదీర్ఘ అనుభవంతో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఈ ప్రతిష్టాత్మకమైన బాధ్యతను దక్కించుకోవచ్చు.