జమ్మూకాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం (జూలై 31)సాయంత్రం ఇటుక బట్టీ వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఛత్తీస్గఢ్కు చెందిన ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో లోయలో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి.
అధికారుల వివరాల ప్రకారం, కెల్లం ప్రాంతంలోని ఇటుక బట్టీలో పనిచేస్తున్న స్థానికేతర కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. మృతులను ఛత్తీస్గఢ్కు చెందిన దీపక్, భోపిందర్గా గుర్తించారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దీపక్ అక్కడికక్కడే మృతి చెందగా, భోపిందర్ను తొలుత స్థానిక ఆసుపత్రికి, అనంతరం అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం ఆయన కూడా మరణించారు.
ఈ దాడికి లష్కర్-ఎ-తైబా (LeT) అనుబంధ సంస్థగా భావించే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల అనంతనాగ్లో పోలీసు అధికారిపై జరిగిన కాల్పుల ఘటనతో పాటు గతంలో పహల్గామ్ ఉగ్రదాడికి కూడా ఇదే సంస్థ బాధ్యత ప్రకటించిన విషయం తెలిసిందే.
ఘటన అనంతరం పోలీసులు, భద్రతా దళాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని దిగ్బంధించాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన అనంతనాగ్లో పోలీసు అధికారిని ఉగ్రవాదులు హత్య చేసిన పది రోజుల వ్యవధిలోనే చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. డీజీపీ నలిన్ ప్రభాత్తో పాటు భద్రతా ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన, ఉగ్రవాదులను ఏరివేయడానికి ఆపరేషన్లు మరింత వేగవంతం చేయాలని భద్రతా బలగాలను ఆదేశించినట్లు తెలిపారు. నిందితులను తప్పకుండా న్యాయస్థానం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.
ఈ ఘటనను పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, ఆప్ని పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ సహా పలు రాజకీయ పార్టీలు ఖండించాయి. కుటుంబాల జీవనోపాధి కోసం కాశ్మీర్కు వచ్చిన అమాయక వలస కార్మికులను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత అమానుషమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..