ఉదయం లేవగానే మనం తీసుకునే ఆహారమే రోజంతా మన శరీరంలోని శక్తి స్థాయిలను, మూడ్ను నిర్ధారిస్తుంది. ఉదయాన్నే ఆరోగ్యకరమైన, ప్రొటీన్, ఫైబర్ నిండిన ఆహారం తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటాం. అలా కాకుండా పొరపాటున కొన్ని రకాల ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో తింటే మాత్రం రోజంతా నీరసం, కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం పూట ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఫోర్టిస్ వసంత్ కుంజ్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ డాక్టర్ శుభమ్ వత్స్య కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.
పరకడుపున పొరపాటున కూడా తినకూడని 3 పదార్థాలు
సిట్రస్ పండ్లు :
ఉదయాన్నే పరకడుపున పుల్లటి పండ్లు లేదా నిమ్మరసం తీసుకోవడం వల్ల కడుపులోని లోపలి పొరలలో తీవ్రమైన మంట పుడుతుంది. ఇది నేరుగా ఎసిడిటీ సమస్యకు దారితీస్తుంది.
బ్లాక్ కాఫీ
చాలామందికి ఉదయం లేవగానే బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ డాక్టర్ వత్స్య ప్రకారం.. ఖాళీ కడుపుతో తాగే బ్లాక్ కాఫీ పొట్టపై ఒక యాసిడ్ షాక్లా పనిచేస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం రావడంతో పాటు శరీరంలో హఠాత్తుగా శక్తి తగ్గిపోయి నీరసపడిపోతారు.
మసాలా – కారంగా ఉండే పదార్థాలు
ఉదయాన్నే పూరీ, ఛోలే-భటోరే, మిసల్ పావ్, పావ్ భాజీ, కచోరీ వంటి నూనె, మసాలాతో కూడిన ఆహారాలు తినడం వల్ల పొట్టలో మంట, దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ఉదయాన్నే వీటిని అస్సలు తినకూడదు.
ఉదయాన్నే పరకడుపున ఏం తినాలి?
ఉదయం పూట జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి డాక్టర్లు ఈ క్రింది తేలికపాటి, పౌష్టికాహారాలను సిఫార్సు చేస్తున్నారు.
- నానబెట్టిన ఎండుద్రాక్ష, బాదం
- ఓట్స్
- అరటిపండు, యాపిల్
- బ్రెడ్ ఆమ్లెట్, రెండు ఉడకబెట్టిన గుడ్లు
- ఇడ్లీ, దోశ వంటి ఆవిరి వంటకాలు