ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకు వేగంగా అభివృద్ది చెందుతున్న క్రమంలో బ్యాంకింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో బ్యాంకింగ్ రంగం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం దాదాపు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ఆన్లైన్ చెల్లింపులు చేయడం లేదా స్వీకరించడం వల్ల ఆదాయపు పన్ను నోటీసు వస్తుందేమోనని చాలామంది పన్ను చెల్లింపుదారులు భయాందోళనకు గురవుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎంత అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కేవలం చెల్లింపు విధానం ద్వారా ఐటీ శాఖ నుంచి నోటీసులు అందవు. మీ బ్యాంక్ ఖాతాలోని లావాదేవీలు, ఐటీ రిటర్న్స్తో ప్రకటించిన ఆదాయంతో సరిపోలుతున్నాయా లేదా అనేది అసలు విషయం. UPI, NEFT, RTGS, IMPS ఆప్షన్లు నగదు బదిలీ చేయడం లేదా స్వీకరించడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందవు. కేవలం డబ్బులు బదిలీ చేసుకోవడానికి ఇవి ఒక మార్గం మాత్రమే. డబ్బు పంపడానికి ఉపయోగించిన యాప్ లేదా మాధ్యమం ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ చర్య తీసుకోదు. బ్యాంకు ఖాతాలో చూపిన మొత్తం, ITRలో దాఖలు చేసిన ఆదాయపు వివరాలతో సరిపోలుతున్నాయా అనేది ఐటీ శాఖ గమనిస్తుంది. ఒకవేళ రెండింటి మధ్య ఏమైనా తేడాలు ఉంటే ఐటీ నోటీసులు రావచ్చు.
ఐటీ నోటీసులు ఎప్పుడు రావొచ్చు
మీరు ITRలో తక్కువ ఆదాయాన్ని చూపించి.. బ్యాంకు ఖాతాలో తరచుగా పెద్ద, భారీ లావాదేవీలు జరుగుతూ ఉంటే ఐటీ శాఖకు అనుమానం వస్తుంది. ఇక చట్టబద్ధమైన మూలం లేని డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ కావడం జరిగితే ఐటీ శాఖ నిఘా పెడుతుంది. మీరు క్రమం తప్పకుండా వ్యాపార సంబంధిత UPI చెల్లింపులను అందుకుంటున్నప్పటికీ.. వాటిని మీ ITRలో వ్యాపార ఆదాయంగా చూపించకపోతే ఇబ్బందుల్లో పడతారు. బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు ఒక నిర్దిష్ట పరిమితికి మించిన అధిక విలువ గల లావాదేవీలను ఐటీ శాఖకు రిపోర్ట్ చేస్తాయి. బ్యాంకు రిపోర్ట్ చేసినంత మాత్రాన మీకు వెంటనే నోటీసు రాదు. మీ లావాదేవీలకు సంబంధించిన సరైన పత్రాలు మీ వద్ద ఉండి, అవి మీరు ప్రకటించిన ఆదాయంతో సరిపోలితే భయపడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. ఒకవేళ ఏమైనా తేడాలో ఉంటే మిమ్మల్ని ఐటీ శాఖ విచారణకు పిలవొచ్చు. మీరు తప్పుడు లెక్కలు చూపించినట్లు తేలితే జైలుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది.