Amarnath Yatra 2026 Telugu: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆరు రోజుల పాటు నిలిపివేసిన వార్షిక అమర్నాథ్ యాత్ర శుక్రవారం మళ్లీ ప్రారంభమైంది. వాతావరణం మెరుగుపడటంతో జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి 6 వేల మందికి పైగా భక్తులు కాశ్మీర్లోని బాల్తాల్ బేస్ క్యాంప్కు బయలుదేరారు. జూలై 19 నుంచి జమ్మూ-కాశ్మీర్లో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రకు సంబంధించిన బాల్తాల్, పహల్గామ్ రెండు మార్గాలపైనా ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు.
అయితే, వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో పాటు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పునరుద్ధరించడంతో యాత్రను తిరిగి ప్రారంభించారు. ఉధంపూర్–రాంబన్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, రాళ్లు జారిపడటం వల్ల మూడు రోజులుగా మూసివేసిన జాతీయ రహదారిని అధికారులు తాజాగా తెరిచారు.
అధికారుల వివరాల ప్రకారం, 18వ విడతలో మొత్తం 6,269 మంది భక్తులు 223 వాహనాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య తెల్లవారుజామున సుమారు 2:40 గంటలకు భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి బాల్తాల్కు బయలుదేరారు. ఈ బృందంలో 1,470 మంది మహిళలు, 25 మంది చిన్నారులు, 54 మంది సాధువులు ఉన్నారు. అయితే, ఈసారి పహల్గామ్ మార్గానికి ఎలాంటి వాహనాల కాన్వాయ్ను పంపలేదని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉండగా, జూలై 22న అనంత్నాగ్ జిల్లాలో అమర్నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉన్న ఇండియన్ రిజర్వ్ పోలీస్ (IRP) సిబ్బందిపై జరిగిన ఉగ్రదాడిలో ఒక జవాన్ మృతి చెందడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు జూలై 2న జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. అధికారికంగా యాత్ర జూలై 3న ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్టు 28తో ముగియనుంది.
ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మంది భక్తులు అమర్నాథ్ గుహ ఆలయాన్ని దర్శించుకున్నారు. వీరిలో సుమారు 1.20 లక్షల మంది భక్తులు జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి తమ యాత్రను ప్రారంభించారు. జమ్మూ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరే భక్తులను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక కాన్వాయ్ల ద్వారా కాశ్మీర్కు తరలిస్తున్నారు.