Headlines

రోడ్డుపై రక్తపు మడుగులో బాధితుడు.. కాన్వాయ్ ఆపి ప్రాణం కాపాడిన మంత్రి జూపల్లి!

రోడ్డుపై రక్తపు మడుగులో బాధితుడు.. కాన్వాయ్ ఆపి ప్రాణం కాపాడిన మంత్రి జూపల్లి!


రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హోదా పక్కనబెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి సకాలంలో అండగా నిలిచారు. తన ప్రయాణాన్ని మధ్యలో నిలిపివేసి, బాధితుడిని తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించి వెంటనే వైద్య చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.

నార్లాపూర్ గ్రామానికి చెందిన కావలి చంద్రయ్య కుమారుడు కావలి మల్లేష్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉన్నాడు. అదే మార్గంలో ప్రయాణిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితుడిని గమనించి వెంటనే తన వాహనాన్ని నిలిపివేశారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కాన్వాయ్‌లోని ఒక వాహనంలో మల్లేష్‌ను సమీప ఆస్పత్రికి తరలించాలని సిబ్బందికి ఆదేశించారు.

అంతేకాకుండా, బాధితుడికి అత్యవసర చికిత్సతో పాటు అవసరమైతే మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. మల్లేష్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. చికిత్సలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా చెప్పారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు వేగంగా స్పందించి బాధితుడి ప్రాణాలను కాపాడేందుకు చూపిన చొరవను స్థానికులు ప్రశంసించారు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించి అత్యవసర సమయంలో సహాయం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ప్రమాదాల సమయంలో ‘గోల్డెన్ అవర్’లో వైద్య సహాయం అందడం అత్యంత కీలకమని వైద్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో, మంత్రి సకాలంలో స్పందించడం వల్ల బాధితుడికి త్వరగా చికిత్స అందే అవకాశం కలిగిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనతో మంత్రి జూపల్లి కృష్ణారావు మానవీయ స్పందన మరోసారి ప్రజల ప్రశంసలు అందుకుంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *