Headlines

సరదాగా వెళ్లారు.. శవాలై వచ్చారు.. చెరువులో నలుగురు చిన్నారుల జలసమాధి

సరదాగా వెళ్లారు.. శవాలై వచ్చారు.. చెరువులో నలుగురు చిన్నారుల జలసమాధి


మహారాష్ట్రలోని అమరావతిలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన ఆ ప్రాంతాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సరదాగా గడపాలని వెళ్లిన నలుగురు చిన్నారులు, చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. అమరావతి నగరంలోని ఖోలాపురి గేట్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన నలుగురు చిన్నారులు, ఉదయం పూట వాకింగ్ కోసం ఇంటి నుండి బయలుదేరారు. నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో వారు సమీపంలోని ఘట్‌ఖేడా చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ నీటిని చూడగానే స్నానం చేయాలనే ఉత్సాహంతో వారు చెరువులోకి దిగారు. అయితే, నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో వారు ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు.

ఈ దుర్ఘటనలో మరణించిన వారు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. మృతులను సోనాలి నరేంద్ర జోషి (16), ఆదిత్య నరేంద్ర జోషి (12), పాయల్ బాబ్లు పండిట్ (21), యశ్ గజానన్ కాక్నే (13) ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మరణించడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పిల్లలు నీటిలో మునిగిపోవడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు మరియు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఖోలాపురి గేట్ పోలీసులు, జిల్లా విపత్తు నిర్వహణ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. స్థానిక గ్రామస్థుల సహకారంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి, నలుగురి మృతదేహాలను చెరువు నుండి వెలికితీశారు.

పిల్లలు చెరువులో స్నానానికి వెళ్లిన సమయంలో అక్కడ పెద్దలెవరూ లేకపోవడం వల్ల వారికి సకాలంలో సహాయం అందలేదని స్థానికులు చెబుతున్నారు. లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఘట్‌ఖేడా పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. వేసవి కాలం లేదా సెలవుల సమయంలో పిల్లలు నీటి వనరుల వద్దకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *