IPL 2026 Benched Players: ఐపీఎల్ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఒక రాత్రిలో ఆటగాడు స్టార్ అయిపోవచ్చు, అలాగే మరో రాత్రిలో కనుమరుగైపోవచ్చు. గత సీజన్లో తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించిన నలుగురు ఆటగాళ్లు ఇప్పుడు ఐపీఎల్ 2026లో కనీసం ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కక బెంచ్కే పరిమితమయ్యారు. ఈ ‘వన్ సీజన్ వండర్స్’ పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఐపీఎల్ చరిత్రలో పాల్ వల్తాటి, కామ్రాన్ ఖాన్ వంటి ఆటగాళ్లు ఒక్క సీజన్లో అద్భుతాలు చేసి ఆ తర్వాత ఎక్కడున్నారో తెలియకుండా పోయారు. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో కూడా అదే పునరావృతమవుతోంది. గత ఏడాది (IPL 2025) అదరగొట్టిన కొందరు ఆటగాళ్లు ఈసారి కేవలం టీమ్ బస్సులో ప్రయాణించే టూరిస్టులుగా మిగిలిపోయారు. ఆ నలుగురు దురదృష్టవంతులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
1. ఆర్ సాయి కిషోర్ (గుజరాత్ టైటాన్స్): గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ ఆర్ సాయి కిషోర్ గత సీజన్లో ఎంతలా మెరిశాడో అందరికీ తెలిసిందే. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్గా 15 మ్యాచ్ల్లో 19 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. కేవలం బౌలింగ్లోనే కాకుండా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్తోనూ ఆకట్టుకున్నాడు. కానీ, ఈ సీజన్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ అతనికి ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదు. ఇంతటి ప్రతిభావంతుడు కేవలం వాటర్ బాయ్గా మిగిలిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
2. అజ్మతుల్లా ఒమర్జాయ్ (పంజాబ్ కింగ్స్): ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ గత ఏడాది శ్రేయస్ అయ్యర్ సారధ్యంలో అద్భుతంగా రాణించాడు. 9 మ్యాచ్ల్లోనే 8 వికెట్లు తీయడమే కాకుండా కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. బంతిని స్వింగ్ చేయడంలో, బ్యాట్తో మెరుపులు మెరిపించడంలో మేటి అయిన ఈ ప్లేయర్, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టులో బెంచ్కే పరిమితమయ్యాడు. పంజాబ్ యాజమాన్యం అతడిని ఎందుకు పక్కన పెట్టిందో ఎవరికీ అర్థం కావడం లేదు.
3. అభిషేక్ పోరెల్ (ఢిల్లీ క్యాపిటల్స్): ఢిల్లీ క్యాపిటల్స్ తరపున గత సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన అభిషేక్ పోరెల్ 301 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ ఈసారి ఢిల్లీ మేనేజ్మెంట్ సీనియర్ ప్లేయర్ నితీష్ రాణాపై మొగ్గు చూపింది. రాణా రాణిస్తుండటంతో పోరెల్ జట్టుకు దూరమయ్యాడు. ఈ సీజన్లో ఆర్సీబీపై ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి 30 పరుగులు చేసినా, ఆ తర్వాత మళ్ళీ అతనికి అవకాశం దక్కలేదు. ప్రస్తుతం తన సీనియర్లకు వాటర్ బాటిళ్లు అందించే పనిలో బిజీగా ఉన్నాడు.
4. కామిందు మెండిస్ (సన్రైజర్స్ హైదరాబాద్): రెండు చేతులతో బౌలింగ్ చేయగల అరుదైన ప్రతిభ కామిందు మెండిస్ సొంతం. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున 5 మ్యాచ్ల్లో 92 పరుగులు చేసి, బౌలింగ్లోనూ వికెట్లు తీశాడు. శ్రీలంక జాతీయ జట్టులో కీలక ఆటగాడైన మెండిస్, ఈ సీజన్లో మాత్రం కేవలం భారత్ దర్శనానికే వచ్చిన టూరిస్ట్లా కనిపిస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ ఎలెవన్లో విదేశీ ఆటగాళ్ల కోటా నిండిపోవడంతో ఈ టాలెంటెడ్ ప్లేయర్ బయటే కూర్చోవాల్సి వస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..