కొలంబియా, మే 3: 1980వ దశకంలో డ్రగ్స్ స్మగ్లర్ పాబ్లో ఎస్కోబార్ తన సొంత విలాసం కోసం ఆఫ్రికా నుంచి మూడు ఆడ, ఒక మగ హిప్పోను అక్రమంగా దేశానికి తీసుకువచ్చాడు. పోలీసుల కాల్పుల్లో ఎస్కోబార్ చనిపోయిన తర్వాత అధికారులు వాటిని అడవిలోనే వదిలేశారు. ఆఫ్రికాలో లాగా వీటిని వేటాడే క్రూర మృగాలు ఇక్కడ లేకపోవడంతో కొలంబియా వాతావరణంలో ఇవి వేగంగా తమ సంతతిని పెంచుకుంటూ పోయాయి.
ప్రస్తుతం ఒక్కో ఆడ హిప్పో తన జీవిత కాలంలో దాదాపు 25 సార్లు పిల్లలకు జన్మనిస్తోంది. ఇదే వేగంతో పెరిగితే రాబోయే రెండు దశాబ్దాల్లో వీటి సంఖ్య వెయ్యికి చేరుకుంటుందని పర్యావరణ నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ జంతువుల వల్ల స్థానిక పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఇవి నదుల్లో విసర్జించే వ్యర్థాల వల్ల నీరు కలుషితం అయి చేపలు చనిపోతున్నాయి. అంతేకాకుండా తీర ప్రాంతాల్లోని మత్స్యకారులపై ఇవి తరచుగా దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో కొలంబియా ప్రభుత్వం వీటిని ఆక్రమణ జాతిగా ప్రకటించింది. వీటి జనాభాను నియంత్రించేందుకు ప్రభుత్వం చేసిన ఖరీదైన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సుమారు 80 హిప్పోలను చంపేయాలని అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయంపై జంతు ప్రేమికులు మండిపడుతుండగా.. భారత వ్యాపారవేత్త అనంత అంబానీకి చెందిన వంతారా సంస్థ వీటిని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. డ్రగ్ మాఫియా మిగిల్చిన ఈ వింత వారసత్వం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.