సిద్దిపేట జిల్లాలో రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బలి.. నలుగురికి గాయాలు!

సిద్దిపేట జిల్లాలో రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బలి.. నలుగురికి గాయాలు!


సిద్ధిపేట జిల్లాలో ఆదివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారును లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే, హుస్నాబాద్ మండలం పందిళ్ళ వంతెన సమీపంలో జరిగింది. శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గంగం శ్రీధర్ రెడ్డి (40) తన భార్య దివ్య తేజ (32), కుమారుడు నిహాన్ రెడ్డి (11), కుమార్తె శ్రీనిక (6)లతో కలిసి హైదరాబాద్ నుండి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. పందిళ్ళ వంతెన వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలు కాగా, భార్య దివ్య తేజ, కుమారుడు నిహాన్ రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సిద్దిపేట ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

ఒకే రోజు జిల్లాలో జరిగిన ఈ రెండు ప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగించాయి. అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదాలకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *