దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కాసేపట్లో జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:20 గంటల వరకు పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది నీట్ పరీక్షకు అభ్యర్థుల తాకిడి భారీగా పెరిగింది. దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల 50 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. గత ఏడాది కంటే ఈసారి అదనంగా లక్షా 80 వేల మంది విద్యార్థులు పోటీ పడుతుండటం విశేషం. దీనిని బట్టి మెడికల్ సీట్ల కోసం పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఏపీలో 25 ప్రధాన పట్టణాల్లో 180 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 45 వేల మంది అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాయనున్నారు. హైదరాబాద్తో పాటు ప్రధాన జిల్లాల్లో భారీగా సెంటర్లను ఏర్పాటు చేశారు.
ముఖ్యమైన సమయాలు
మధ్యాహ్నం 1:30 గంటలకు: పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలకు అనుమతించే ప్రసక్తే లేదని NTA స్పష్టం చేసింది. మధ్యాహ్నం 1:50 గంటలకు విద్యార్థులకు ప్రశ్నపత్రాలను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2:00 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది.
నిబంధనలు – డ్రెస్ కోడ్
పరీక్షా కేంద్రాల్లో కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి.
నిషేధిత వస్తువులు: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరు.
డ్రెస్ కోడ్: తేలికపాటి దుస్తులు, సగం చేతుల చొక్కాలు ధరించాలి. పెద్ద బటన్లు ఉన్న దుస్తులు, షూస్ వేసుకోకూడదు. కేవలం చెప్పులు లేదా తక్కువ హీల్ ఉన్న శాండల్స్కు మాత్రమే అనుమతి ఉంటుంది.
గుర్తింపు కార్డు: అడ్మిట్ కార్డ్తో పాటు ఒరిజినల్ ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరి.
పకడ్బందీగా పర్యవేక్షణ
పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు, జామర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తనిఖీలు నిర్వహించిన తర్వాతే లోపలికి పంపిస్తారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, నర్సింగ్ కోర్సుల్లో సీట్ల సాధనే లక్ష్యంగా విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.