
గత కొంతకాలంగా సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ తనపై వస్తున్న తీవ్రమైన ఆరోపణలు, విమర్శలపై తొలిసారిగా నోరు విప్పారు. టీవీ9 క్రాస్ఫైర్లో రఘురామ కృష్ణరాజు కేసు నుంచి తన సస్పెన్షన్ వరకు ప్రతి అంశంపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తాను అనుభవిస్తున్న రెండేళ్ల సస్పెన్షన్ కాలాన్ని తాను శిక్షగా భావించడం లేదని సునీల్ కుమార్ తెలిపారు. “ఈ కాలాన్ని నేను పనిష్మెంట్గా చూడడం లేదు. నాకు నచ్చిన పనులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాను” అని తెలిపారు. అంతేకాకుండా గతంలో తాను చేసిన పనుల వల్ల ఇది కర్మ రిటర్న్స్ అని కొందరు అంటున్నారని, అయితే తాను దారుణమైన పనులు ఏవీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
రఘురామ కృష్ణరాజు కేసు – అరెస్టులు
జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పీవీ సునీల్ కుమార్ పేరు చెబితేనే ప్రజలు, విపక్షాలు వణికిపోయేవారని, తెల్లారేసరికి ఎవరిని అరెస్టు చేస్తారో అన్న భయం ఉండేదనే వాదనపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ప్రజల్లో అటువంటి అభిప్రాయం ఉందనేది వాస్తవమే కావొచ్చు కానీ, తాను చేసిన పనులన్నీ చట్టపరంగానే ఉన్నాయని ఆయన వాదించారు. ఆకివీడు రామాలయం వివాదం, సీఐడీ పరిధిలోకి తెచ్చిన కేసులు, రఘురామ కృష్ణరాజు అరెస్టు వంటి అంశాలలో ఎదురైన ఉద్రిక్త పరిస్థితులపై స్పందిస్తూ.. అవి కేవలం పరిపాలనాపరంగా తీసుకున్న నిర్ణయాలేనని వివరించారు.