పెళ్లైన రెండు నెలలకే భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదారబాద్లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కూకట్పల్లికి చెందిన కార్తీక్ అనే యువకుడు, తన బంధువుల అమ్మాయి మంజులను ఈ ఏడాది మార్చి 8న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కార్తీక్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, మంజుల ఇంట్లోనే ఉండి కుటుంబ బాధ్యతలు నిర్వహించేది.
అయితే ఈ రోజు ఉదయం కార్తీక్ ఉద్యోగానికి హాజరు కాకపోవడం, అతని ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో బంధువులకు అనుమానం కలిగింది. వెంటనే వారు ఇంటికి వెళ్లి చూడగా, దంపతులు ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. బంధువులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర షాక్కు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కార్తీక్, మంజుల ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారని, వారి మధ్య ఎలాంటి పెద్ద గొడవలు కూడా లేవని బంధువులు తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు అన్నది ఇప్పటికీ అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.