గత కొంతకాలంగా తనపై వస్తున్న తీవ్ర ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ స్పందించారు. టీవీ9 క్రాస్ ఫైర్లో పలు కీలక విషయాలను వెల్లడించారు. తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం వెనుక రాజకీయ నేతల స్వార్థ ప్రయోజనాలు, వ్యవస్థలోని లోపాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. పోలీసు వ్యవస్థలో ఎంతోమంది ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నప్పటికీ, తనను మాత్రమే ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారని సునీల్ కుమార్ ప్రశ్నించారు. దీని వెనుక బైపోలార్ రాజకీయ వ్యవస్థ ఉందని, కొంతమంది తమ రాజకీయ కెరీర్ పురోగతి కోసం తనను బలిపశువును చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్టు సమయంలో కొట్టారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “అరెస్టు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశాం. మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించినప్పుడు ఆయనపై ఎలాంటి గాయాలు లేవని తేలింది” అని ఆయన గుర్తు చేశారు. ఈ కేసుపై మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన తెలిపారు.
2019 నుండి 2024 వరకు జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆయనను మెప్పించడానికే కేసులు పెట్టారన్న ఆరోపణలపై సునీల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. “ఎవరినో సాటిస్ఫై చేయడానికి నేను పనిచేయలేదు. ఒక అధికారిగా చట్టం పరిధిలోనే నా విధులు నిర్వర్తించాను” అని స్పష్టం చేశారు. అందరినీ అరెస్టు చేసి సీఎంను సంతోషపెట్టాననేది కేవలం ఒక దుష్ప్రచారమని కొట్టిపారేశారు.ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి నుంచి ప్రతిరోజూ బ్రీఫింగ్లు తీసుకుంటారని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. “సజ్జల గారు నాకు పాత మిత్రుడు. అంత మాత్రాన ప్రతిరోజూ ఆయన విల్లాకు వెళ్లి ఎవరిని అరెస్టు చేయాలో చర్చించలేదు. నా మొత్తం పదవీకాలంలో ఆయనను కలిసింది మూడు నాలుగు సార్లు మాత్రమే. అది కూడా వ్యక్తిగతమే తప్ప రాజకీయాలకు సంబంధించింది కాదు” అని స్పష్టం చేశారు