ప్రముఖ గాయని మంగ్లీ.. ఈ పేరు వినగానే ఉత్సాహభరితమైన పల్లె పాటలు గుర్తుకొస్తాయి. తాండలో పుట్టి, కష్టాలతో ఎదిగి, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని మంగ్లీ ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బచ్చినేపల్లి తాండలో ఒక నిరుపేద బంజార కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, ప్రాథమిక విద్యను తన తాండలోనే ఐదవ తరగతి వరకు పూర్తి చేశారు. ఆ తర్వాత ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు బాలికల ఉన్నత పాఠశాలలో చదివారు. ఈ సమయంలోనే ఆమె ప్రతిభను గుర్తించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందించింది.
ఆర్థిక సహాయంతో మంగ్లీ తిరుపతిలో కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. పదవ తరగతి పూర్తయిన తర్వాత, అదే సహాయంతో శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో మ్యూజిక్ అండ్ డాన్స్ విభాగంలో డిప్లొమా కోర్సును పూర్తి చేశారు. సంగీతంపై పట్టు సాధించాలనే లక్ష్యంతో, తిరుపతిలోని సంగీత విద్యాలయంలో కూడా లోతైన శిక్షణ పొందారు. ఈ దశలోనే ఆమె గాత్రం మరింత మెరుగుపడింది. మంగ్లీ ప్రస్థానంలో కీలక మలుపు “తీన్మార్” ఫోక్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆమె టీవీ ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. పల్లె పాటలకు కొత్త ఉత్సాహాన్ని జోడిస్తూ, ఆమె గాత్రం త్వరగానే ప్రజల్లోకి వెళ్లింది. జానపద గీతాలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం.. తర్వాత సినీ రంగంలోకి దారి తీసింది. పండుగ పాటలు, బతుకమ్మ గీతాలు, భక్తి గీతాలతో మంగ్లీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె పాడిన పాటలు యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికలపై కోట్ల వ్యూస్ సాధించి, ఆమెను మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి.
బోనాలు, బతుకమ్మ, శివరాత్రి వంటి పండుగల సమయంలో మంగ్లీ గాత్రం ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఆమె గాత్రంలో ఉన్న ఉత్సాహం, భక్తి భావం ప్రజలను ఆకట్టుకుంటాయి. జానపదాన్ని అలాగే ఉంచుతూ ఆధునిక సంగీతంతో కలిపి యువతకు చేరువ చేయడం ఆమె ప్రత్యేకత. ఒక చిన్న తాండలో పుట్టిన అమ్మాయి.. ఈరోజు లక్షల మందికి స్ఫూర్తిగా మారింది. కష్టపడితే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని మంగ్లీ తన జీవితంతో నిరూపించారు. తాండలో పుట్టిన గాత్రం.. ఇప్పుడు ప్రతి పండుగకు, ప్రతి సంబరానికి ఓ స్వరంగా మారింది. మంగ్లీ ప్రస్థానం.. కేవలం సంగీత యాత్ర కాదు, లక్షల మందికి స్ఫూర్తినిచ్చే జీవితం. అయితే ఆ పేరు ఇప్పుడు ఓ భారీ స్కామ్ చుట్టూ తిరగడం చర్చనీయాంశ అంశం.
జానపద గీతాలతో మొదలైన మంగ్లీ కెరీర్.. వివాదాల చుట్టూ తిరుగుతోంది. ప్రత్యేకమైన యాస, ఎనర్జీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సింగర్.. తక్కువ కాలంలోనే సెలబ్రిటీగా మారిపోయారు. అయితే గోకుల నందన ఫ్రాడ్ కేసుతో సంబంధం ఉన్న ఆరోపణలతో మరోసారి బ్యానర్ ఐటమ్గా మారిపోయారు. ఇది ఏమాత్రం జీర్ణించుకోలేని మంగ్లీ మరోసారి వివరణ ఇచ్చారు. మోసం కేసులో తన పాత్రేం లేదని క్లారిటీ ఇచ్చారు.
గోకుల నందన చీటింగ్ ఎపిసోడ్లో మధునాయక్, హిమాకాంత్ రెడ్డి, సుబ్బారావుదే కీ రోల్ అన్నారు మంగ్లీ. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. లక్షల రూపాయలు నష్టపోయి బాధితులు ఎంత నరకం అనుభవిస్తున్నారో తల్చుకుంటేనే బాధగా ఉందన్నారు మంగ్లీ. వాళ్లందరికీ అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటా.. బ్యాడ్గా ప్రచారం చేసిన వాళ్లను చేతులెత్తి దండం పెడుతున్నా వాళ్లను శిక్షించాలి..
లాయర్ సుబ్బారావు వెంట తిరుగుతున్న హిమాకాంత్ను విచారిస్తే.. అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు మంగ్లీ తరఫు న్యాయవాది. ఆతనే అసలు నిందితుడని ఆరోపించారు. కాస్త లేటయినా లేటెస్ట్గా ఫ్రేమ్లోకి వచ్చాడు హిమాకాంత్ రెడ్డి. మరి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తారా? మోసాల చిట్టాలో ఎవరెవరి పాపం ఎంతుందో తేల్చేస్తారా? నిజాలు బయటపెట్టి బాధితులకు న్యాయం చేస్తారా? ఫ్రాడ్ దందాలో ఎలాంటి కోణాలు.. ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనన్నది ఆసక్తికరంగా మారింది.