కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. విద్యార్థులు, వ్యాపారులు, మహిళలకు రుణ సదుపాయం కల్పి్స్తోంది. తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి లోన్ అందిస్తోంది. అందులో భాగంగా వీధి వ్యాపారులు, చిన్న దుకాణాదారులకు తోడ్పాలటు అందించేందుకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణ సౌకర్యం అందిస్తోంది. రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు లోన్ పొందవచ్చు. సకాలంలో లోన్ చెల్లిస్తే వడ్డీ రాయితీతో పాటు డిజిటల్ లావాదేవీలపై క్యాష్బ్యాక్ సౌకర్యం కల్పిస్తోంది. చిరు వ్యాపారులకు క్రెడిట్ కార్డ్ సౌకర్యాలను కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల తమకు అవసరమైన సమయంలో వీధి వ్యాపారులు వాడుకోవచ్చు.
లోన్తో పాటు క్రెడిట్ కార్డ్
పీఎం స్వనిధి పథకం ద్వారా రుణంతో పాటు క్రెడిట్ కార్డు కూడా అందిస్తోంది. దీంతో తమకు అవసరమైనప్పుడు రూ.30 వేల వరకు ఉపయోగించుకోగలరు. దీనిపై వీధి వ్యాపారులు, దుకాణాదారులకు కేంద్రం అవగాహన కల్పిస్తోంది. కరోనా కాలంలో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఆ తర్వాత కాలక్రమేణా ఈ పథకంలో కీలక మార్పులు చేశారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డులను కూడా జారీ చేస్తున్నారు. తొలిసారి రుణం తీసుకునేటప్పుడు రూ.10 వేలు అందిస్తారు. ఆ తర్వాత తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తే రూ.20 వేలు అందిస్తారు. దానికి కూడా గడువులోగా చెల్లిస్తే రూ.50 వేలు పొందే సౌకర్యం ఉంటుంది. ఇలా విడతల వారీగా రూ.80 వేల వరకు రుణాన్ని పొందవచ్చు. తీసుకున్న రుణం సకాలంలో చెల్లిస్తే 7 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. అలాగే డిజిటల్ లావాదేవీపై రూ.1200 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
అప్లై చేసుకోడం ఎలా..?
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ క్యాష్ బ్యాక్ అందిస్తుంది. ఈ లోన్ పొందేందుకు ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఎంఎన్ఆర్ఈజీఏ కార్డు లాంటి గుర్తింపు ధృవీకరణ పత్రాలు అవసరం. ఇక కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే గ్రామీణ, చిన్న ఫైనాన్స్, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణం పొందవచ్చు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. చిన్న వ్యాపారులకు ఆర్దికంగా చేయూత అందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని లాంచ్ చేసింది. కరోనా వల్ల చాలామంది వీధి వ్యాపారులు, దుకాణాదారులు నష్టపోయారు. దీంతో ఈ పధకం ద్వారా లక్షలాది వ్యాపారులు ప్రయోజనం పొందుతున్నారు.