8వ కేంద్ర వేతన సంఘానికి సంబంధించిన వినతిపత్రాల సమర్పణ గడువు విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. జాతీయ మండలి – సంయుక్త సంప్రదింపుల యంత్రాంగం (NC-JCM) సిబ్బంది పక్షం చేసిన విజ్ఞప్తికి స్పందించిన వేతన సంఘం, ముందుగా నిర్ణయించిన ఏప్రిల్ 30, 2026 గడువును మే 31, 2026 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలకు కొంత ఉపశమనం కలిగించే అంశంగా భావిస్తున్నారు. అయితే సమర్పణ విధానంలో మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. వినతిపత్రాలను కేవలం ఆన్లైన్లో నిర్దేశించిన లింక్ ద్వారా మాత్రమే సమర్పించాలన్న నిబంధనను కొనసాగించింది. PDF, MS Word ఫైళ్లు లేదా హార్డ్ కాపీల రూపంలో సమర్పణకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
ఈ విషయంలో NC-JCM చేసిన అభ్యర్థనను వేతన సంఘం తిరస్కరించడం గమనార్హం. ఇటీవల జరిగిన సమావేశంలో అనేక ఉద్యోగ సంఘాలు సాంకేతిక సమస్యల కారణంగా ఆన్లైన్ సమర్పణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని NC-JCM ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో గడువు పొడిగింపు అవసరమని తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న వేతన సంఘం గడువును నెలరోజులు పెంచింది. వినతిపత్రం అంటే ఉద్యోగులు లేదా పెన్షనర్ల సంఘాలు తమ వేతనాలు, పెన్షన్లు, భత్యాలు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వంటి అంశాలపై తమ డిమాండ్లను సమగ్రంగా వివరించే పత్రం.
ఇందులో పని పరిస్థితులు, జీవన వ్యయం, ఇతర ఆర్థిక అంశాలు కూడా ప్రస్తావించవచ్చు. ఉదాహరణకు NC-JCM ఇప్పటికే 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో పాటు కనీస మూల వేతనాన్ని రూ.69,000గా నిర్ణయించాలని డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, కేంద్రపాలిత ప్రాంతాల సిబ్బంది, న్యాయ విభాగాల అధికారులు, పెన్షనర్లు, సేవా సంఘాలు తదితరులు తమ వినతిపత్రాలను సమర్పించడానికి అర్హులు. వీరందరూ వేతన సంఘం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా నిర్ణీత ఫార్మాట్లో తమ ప్రతిపాదనలు పంపవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా భవిష్యత్ వేతన నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకోబడనున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి