ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ప్రకృతిలోని సహజ దృశ్యాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక రైతు పంట పొలంలో పక్షి గుడ్లు కనిపించడం విశేషంగా మారింది. తాజాగా టమాటా సాగు చేస్తున్న ఒక వ్యవసాయ భూమిలో ఎర్రముక్కు తీతువ పిట్ట గుడ్లు కనుగొనడం జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ తీతువ పిట్ట భారతదేశంలో సాధారణంగా కనిపించే పక్షే అయినప్పటికీ, పంట పొలంలో గుడ్లు పెట్టడం మాత్రం ఆసక్తికరమైన దృశ్యంగా చెప్పుకోవచ్చు. పల్లెటూర్లలో ఈ పక్షి అరుపు గురించి కొన్ని మూఢనమ్మకాలు ఉన్నప్పటికీ, ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పక్షి సాధారణంగా పంట పొలాలు, చెరువుల గట్లు, మెట్ట భూములు వంటి ఓపెన్ ప్రదేశాల్లో నివసిస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే.. ఇది గూడు నిర్మించదు. నేలపైనే, రాళ్ల మధ్యలో లేదా మట్టిపైన నేరుగా గుడ్లు పెడుతుంది.
తీతువ పిట్టలు సాధారణంగా మార్చి నుంచి ఏప్రిల్ వరకు గుడ్లు పెడతాయి. ఒకేసారి మూడు నుంచి నాలుగు గుడ్లు పెట్టి, దాదాపు 18 రోజులు వాటిని పొదిగి పిల్లలను సంరక్షిస్తాయి. ఈ గుడ్లు క్వైల్ గుడ్లలా కనిపించినప్పటికీ, కొంచెం పెద్దగా, పియర్ ఆకారంలో ఉంటాయి. గుడ్లపై ఉండే నల్ల మచ్చలు, గోధుమ రంగు వాటిని నేల రంగులో కలిపేసి శత్రువుల నుంచి రక్షిస్తాయి.. ఇది సహజమైన రక్షణ పద్ధతి. ఈ గుడ్లు కనుగొన్న ప్రదేశంలో టమాటా సాగు జరుగుతుండటం ప్రత్యేకత. వ్యవసాయ భూముల్లో పక్షులు తమ సంతానాన్ని పెంచుకోవడం ప్రకృతి సమతుల్యతను సూచిస్తుంది. ఇటువంటి దృశ్యాలు జీవవైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని మనకు గుర్తుచేస్తాయి. ప్రతి జీవికి ప్రకృతిలో ప్రత్యేక స్థానం ఉందని, వాటి నివాసాలను రక్షించడం మన బాధ్యత అని ఈ సంఘటన మరోసారి చాటి చెబుతోంది.

Teethuvu Pitta
రైతుకు పొలంలోని గడ్డిలో కనిపించిన గూడు.. ఏమున్నాయా అని చూడగా..