ఓరి మీ దుంపతెగ.. AIని ఇలా కూడా వాడుతున్నారా? ఇక సామాన్యులు ఎలా బతికేది?

ఓరి మీ దుంపతెగ.. AIని ఇలా కూడా వాడుతున్నారా? ఇక సామాన్యులు ఎలా బతికేది?


అహ్మదాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేసి ఆర్థిక మోసానికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకుంది. అహ్మాదాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితులు ఆధునిక AI టూల్స్‌ను ఉపయోగించి ఒక వ్యాపారవేత్తను లక్ష్యంగా చేసుకుని మోసం చేశారు. ఈ కేసు బయటపడటానికి కారణం బాధితుడు తన బ్యాంక్ ఖాతాకు రెండు రోజులుగా OTP సందేశాలు రావడం ఆగిపోయిన విషయాన్ని గమనించడమే. అనుమానం కలగడంతో పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తులో పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. నిందితులు అతని ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను OTP ధృవీకరణ లేకుండా మార్చినట్లు పోలీసులు గుర్తించారు.

దీనికోసం వారు గూగుల్‌ జెమినీ వంటి AI సాధనాలను ఉపయోగించి బాధితుడి డీప్‌ఫేక్ వీడియోలను సృష్టించారు. ఈ వీడియోల ఆధారంగా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను మోసగించి, మొబైల్ నంబర్‌ను తమ నియంత్రణలో ఉన్న నంబర్‌గా మార్చుకున్నారు. తద్వారా బ్యాంక్ OTPలు అన్నీ నేరుగా వారి చేతుల్లోకి వెళ్లేలా చేశారు. అంతేకాకుండా నిందితులు బాధితుడి డిజీ లాకర్‌ ఖాతాలోకి ప్రవేశించి, అతని వ్యక్తిగత పత్రాలను కూడా యాక్సెస్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వివరాలతో వారు ఈ-కెవైసీ ప్రక్రియ ద్వారా మూడు బ్యాంకుల్లో ఖాతాలు తెరవడానికి ప్రయత్నించగా, జియో పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఖాతా తెరవడంలో విజయం సాధించారు. అక్కడి నుంచి రూ.25,000 రుణం కూడా తీసుకున్నారు.

ఈ మోసంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఒకరు కామన్ సర్వీస్ సెంటర్‌లో పనిచేసేవాడని, అతను ఆధార్ వ్యవస్థలకు ఉన్న యాక్సెస్‌ను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అరెస్టు చేసిన నిందితులను కనుభాయ్ పర్మార్, ఆశిష్ వానంద్, మహమ్మద్ కైఫ్ పటేల్, దీప్ గుప్తాగా గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా AI ఆధారిత సైబర్ నేరాలపై ఆందోళనలను మరింత పెంచింది. నిపుణులు హెచ్చరిస్తున్నదేమిటంటే, AI సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ భద్రతా చర్యలను కూడా అంతే వేగంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *