నేపాల్ ఎయిర్లైన్స్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వివాదాస్పద నెట్వర్క్ మ్యాప్ భారత్-నేపాల్ మధ్య చిచ్చు రేపింది. ఈ మ్యాప్లో భారత భూభాగాలైన జమ్మూ-కాశ్మీర్, లడఖ్లను పాకిస్థాన్లో భాగంగా చూపించడం తీవ్ర దుమారానికి దారితీసింది. భారతీయుల నుండి వెల్లువెత్తిన ఆగ్రహం, సోషల్ మీడియా నిరసనల నేపథ్యంలో ఎయిర్లైన్ యాజమాన్యం దిగివచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పింది.
గురువారం నాడు (ఏప్రిల్ 30) నేపాల్ ఎయిర్లైన్స్ తన విమాన ప్రయాణ మార్గాలను వివరిస్తూ ఒక ప్రచార చిత్రాన్ని పంచుకుంది. అందులో అంతర్జాతీయ సరిహద్దులను తప్పుగా చిత్రీకరించారు. దీనిపై భోజ్పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కేవలం పోస్ట్ను తొలగిస్తే సరిపోదని, దీని వెనుక ఉన్న ఉద్దేశాలను స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. “శాంతియుత పొరుగు దేశం ఇలాంటి తప్పు చేయడానికి కారణం ఏంటి?” అని ఆయన ప్రశ్నించారు.
माय डियर नेपाल एयरलाइंस,
पोस्ट डिलीट करके भाग जाने से काम नहीं चलेगा। जबाब देना पड़ेगा। माफ़ी माँगिए या फिर मंशा बताइए की क्यू ऐसा किए ?
इतना शांत और अच्छा पड़ोसी आख़िर किस मजबूरी में ऐसा गलती करने लगा ? https://t.co/cvuPaZoylF
— Khesari Lal Yadav (खेसारी) (@khesariLY) April 29, 2026
సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు నేపాల్ తీరును ఎండగట్టారు. భారతదేశం ఎల్లప్పుడూ నేపాల్ ఆర్థిక వ్యవస్థకు అండగా ఉంటోందని, ఉద్యోగ అవకాశాలు, విద్యుత్, ఇంధనం, విపత్తు సమయాల్లో సహాయం అందిస్తోందని గుర్తు చేశారు. అంతటి సన్నిహిత మిత్రదేశం ఇలాంటి మ్యాప్ నిర్మాణ దోషాలకు పాల్పడటం భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శలు వెల్లువెత్తాయి. వివాదం ముదరడంతో నేపాల్ ఎయిర్లైన్స్ స్పందిస్తూ.. “మా సోషల్ మీడియాలో పంచుకున్న మ్యాప్లోని తప్పులకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. ఇవి కేవలం సాంకేతిక పొరపాట్లు మాత్రమే” అని వివరణ ఇచ్చింది. గతంలో 2025లో ఇజ్రాయెల్ సైన్యం కూడా ఇలాంటి పొరపాటే చేసి సరిదిద్దుకున్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
We sincerely apologize for error in the network map recently shared on our social media channels. The map contained significant cartographic inaccuracies regarding international boundaries that do not reflect the official stance of Nepal or Nepal Airlines. pic.twitter.com/E5MZSS8CjQ
— Nepal Airlines🇳🇵 (@NepalAirlinesRA) April 30, 2026
నేపాల్ ఎయిర్లైన్స్ ప్రస్తుతం తన విమాన సర్వీసులను ఢిల్లీ, బెంగళూరు వంటి భారతీయ నగరాలకు విస్తరించాలని రూ. 8 బిలియన్ల భారీ ప్రణాళికతో ఉంది. ఇలాంటి కీలక సమయంలో తలెత్తిన ఈ వివాదం ఆ సంస్థ భవిష్యత్తు ప్రణాళికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సరిహద్దుల వంటి సున్నితమైన అంశాలలో చిన్న పొరపాటు కూడా దౌత్యపరమైన ఇబ్బందులకు దారితీస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..