Sajjanar: మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్‌.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ స్పెషల్‌ రిక్వెస్ట్‌

Sajjanar: మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్‌.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ స్పెషల్‌ రిక్వెస్ట్‌


Sajjanar: మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్‌.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ స్పెషల్‌ రిక్వెస్ట్‌

పదోతరగతి పరీక్షల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యార్థులు తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ సచ్చనార్ కీలక సూచనలు చేశారు. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత కొన్ని నిండు ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, మార్కులు తక్కువ వచ్చాయని లేదా విఫలమయ్యామని ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదని, అది ఆయా కుటుంబాలకు తీరని శోకాన్ని మాత్రమే మిగులుస్తుందని తెలిపారు. ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల ఆత్మహ‌త్య కేసుల‌ను మహిళా భద్రత విభాగం అధికారులు స‌మ‌గ్రంగా దర్యాప్తు చేసి, బాధిత తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు కొన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయ‌ని తెలిపారు.

ఓటమి అనేది గెలుపుకు తొలిమెట్టు కావాలే తప్ప, జీవితానికి ముగింపు కాకూడదని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని కోరారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ ఆశలను, అంచనాలను పిల్లలపై భారంగా మోపి వారిని ఒత్తిడికి గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఫలితం ఏదైనా సరే, పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోవాలని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని సూచించారు. మార్కుల కంటే పిల్లల ప్రాణం, వారి చిరునవ్వు తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించాలని, వారు ఒంటరిగా ఉన్నా లేదా మౌనంగా ఉన్నా వారి వెన్నంటి ఉండి ధైర్యం చెప్పాలని కోరారు. అవసరమైతే పనులన్నీ పక్కన పెట్టి, ఒక రోజంతా వారితో గడిపి, వారి మనసులోని భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని గుర్తు చేశారు.

ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో విద్యార్థులతో సంభాషించి, ఫెయిల్యూర్ అనేది కేవలం తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉంటాయని వారికి భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు. చదువులో వెనుకబడిన ఎందరో వ్యక్తులు పట్టుదలతో శ్రమించి నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్థాయికి చేరుకున్నారన్న నిజాన్ని ఎవరూ మరువవద్దని ఉద్ఘాటించారు.

పరీక్షల కంటే ప్రాణం గొప్పదని, ప్రతి విద్యార్థి వెనుక ఒక కుటుంబం ఉందని, వారి కోసం తల్లిదండ్రులు తపిస్తున్నారని ఆలోచించాలని సూచించారు. ఏ చిన్న ఆందోళన కలిగినా విద్యార్థులు తమ తల్లిదండ్రులతో లేదా ఆత్మీయులతో మనసు విప్పి పంచుకోవాలని, ప్రతికూల ఫలితాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *