IPL 2026: నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!

IPL 2026: నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!


Punjab Kings Players Wearing Black Armbands vs Rajasthan Royals: పంజాబ్ కింగ్స్ జట్టులోని స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ మాతృమూర్తి సోమవారం (ఏప్రిల్ 27) కన్నుమూశారు. ఈ బాధాకరమైన వార్త విన్న వెంటనే ఒమర్జాయ్ తన స్వదేశమైన ఆఫ్ఘనిస్తాన్‌కు బయలుదేరాడు. తన సహచర ఆటగాడికి ఎదురైన ఈ కష్ట సమయంలో అండగా నిలవాలని నిర్ణయించుకున్న పంజాబ్ కింగ్స్ యాజమాన్యం, ఆటగాళ్లు, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నల్ల రిబ్బన్లు ధరించి తమ నివాళులర్పించారు.

ఒమర్జాయ్ కుటుంబానికి జట్టు మద్దతు..

ఈ విషాదంపై పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ.. “అజ్మతుల్లా ఒమర్జాయ్ మాతృమూర్తి మరణం మా అందరినీ తీవ్రంగా కలచివేసింది. ఈ కష్ట సమయంలో పంజాబ్ కింగ్స్ కుటుంబం మొత్తం ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటుంది” అని పేర్కొంది. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్లందరూ తమ చేతులకు నల్ల రిబ్బన్లు ధరించి గౌరవాన్ని చాటుకున్నారు.

టాస్ సమయంలో శ్రేయాస్ అయ్యర్ నివాళి..

కేవలం మైదానంలోనే కాకుండా, టాస్ సమయంలో కూడా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తన సహచరుడిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. “మా జట్టు తరపున అజ్మతుల్లా, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మేం ఎప్పుడూ ఆయన వెంటే ఉంటాం” అని అయ్యర్ భావోద్వేగంతో వ్యాఖ్యానించాడు. ఒక కెప్టెన్‌గా అయ్యర్ చేసిన ఈ పనికి క్రీడాభిమానుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి.

ఐపీఎల్ 2026లో ఒమర్జాయ్ పరిస్థితి..

ప్రస్తుత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచింది. అయితే, అజ్మతుల్లా ఒమర్జాయ్‌కు ఈ సీజన్‌లో ఇంకా ఆడే అవకాశం లభించలేదు. విదేశీ ఆటగాళ్ల కోటాలో మార్కస్ స్టోయినిస్, కూపర్ కానోలీ, మార్కో జాన్సెన్ వంటి వారికి ప్రాధాన్యత లభిస్తోంది. అయినప్పటికీ, గత ఏడాది 2.4 కోట్ల రూపాయలకు అమ్ముడైన ఒమర్జాయ్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన త్వరలోనే తిరిగి జట్టుతో చేరుతారని సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *