Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్లో తన సంచలన బ్యాటింగ్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మరో భారీ రికార్డు పై కన్నేశాడు. పంజాబ్ కింగ్స్తో జరగనున్న తదుపరి మ్యాచ్లో ఈ యంగ్ ఓపెనర్ కేవలం కొన్ని పరుగులు సాధిస్తే చాలు, ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ ప్లేస్కు చేరుకోవడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ఒక అరుదైన మైలురాయిని అధిగమిస్తాడు. ముల్లాంపూర్ వేదికగా జరగనున్న ఈ పోరులో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ ఆడే ఇన్నింగ్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానం
రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లోనే 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సహాయంతో 357 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్న వైభవ్ సూర్యవంశీ, పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో కేవలం 24 పరుగులు చేస్తే చాలు, లీగ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంటాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదిన అతడి దూకుడు చూస్తుంటే, ఈ 24 పరుగులు చేయడం అతనికి పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది.
చారిత్రాత్మక స్ట్రైక్ రేట్ రికార్డు
కేవలం పరుగులే కాదు, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేసే శైలి అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. అతను మరో 43 పరుగులు సాధిస్తే, ఈ సీజన్లో 400 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఇలా జరిగితే ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో 230 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 400 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మన్గా వైభవ్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు. గత సీజన్లో కూడా అతను 206.55 స్ట్రైక్ రేట్తో 252 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఇప్పుడు తన రికార్డును తనే తిరగరాసేందుకు సిద్ధమయ్యాడు.
పంజాబ్పై పాత జ్ఞాపకాలు
వైభవ్ సూర్యవంశీకి పంజాబ్ కింగ్స్పై ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. గత సీజన్లో పంజాబ్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, వైభవ్ కేవలం 15 బంతుల్లోనే 40 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ 40 పరుగుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అంటే తను చేసిన పరుగులన్నీ కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. మళ్ళీ అదే పంజాబ్ జట్టుతో మ్యాచ్ జరుగుతుండటంతో, ఫ్యాన్స్ మరోసారి అలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు.
మ్యాచ్ కీలకం
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ గెలిచి తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని పంజాబ్ భావిస్తుండగా, గత మ్యాచ్లో ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ గెలుపు బాట పట్టాలని పట్టుదలతో ఉంది. వైభవ్ సూర్యవంశీ ఇచ్చే ఆరంభం రాజస్థాన్ విజయానికి ఎంతో కీలకం కానుంది. ముల్లాంపూర్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుండటంతో వైభవ్ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..