కేరళలోని కోజికోడ్లో గుండెలు జారిపోయే ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న ఒక చిన్నారి దిండు కింద ఏకంగా ఐదు అత్యంత విషపూరితమైన పాములు బయటపడ్డాయి. కేరళలోని కోజికోడ్లో జరిగిన ఒక సంఘటన ఆ ప్రాంతం మొత్తాన్ని కలవరపరిచింది. అర్థరాత్రి పిల్లలు నిద్రపోతున్న గదిలోంచి ఒక విషపూరితమైన పాము అకస్మాత్తుగా బయటకు వచ్చింది. షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఇళ్లంతా పరిశీలించి చూడగా, ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు ప్రమాదకరమైన పాములు బయటపడ్డాయి. ఈ ఘటన తర్వాత, ఆ కుటుంబమే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నారు. ఇందులో అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే, ఈ పాములు ఏ మూలలోనూ కాకుండా, మంచం మీద, పిల్లల దిండుల కింద, పరుపుల మధ్య దాగి ఉన్నాయి.
కోజికోడ్కు చెందిన ఒక ఇంట్లో చిన్నారి మంచంపై నిద్రిస్తోంది. కానీ, అక్కడంతా ఏదో అనుమానస్పద శబ్ధాలు, వింత అలజడి అనిపించింది ఆ తల్లిదండ్రులకు. అనుమానం వచ్చి దిండును పక్కకు జరపగా, అక్కడ ఐదు చిన్న పాములు కనిపించాయి. అవి సాధారణ పాములు కావు.. భారతదేశంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటిగా పేరొందిన కామన్ క్రైట్ (కట్లపాము) పిల్లలు.
పాములను చూసిన వెంటనే కుటుంబ సభ్యులు భయాందోళనకు గురికాకుండా స్థానిక స్నేక్ రెస్క్యూ టీమ్కు సమాచారం అందించారు. వారు వచ్చి నేర్పుగా ఆ ఐదు పాములను బంధించారు. ఇంటి పరిసరాల్లో లేదా గోడల పగుళ్లలో పాములు గుడ్లు పెట్టి ఉండవచ్చని, అందుకే ఒకేసారి ఇన్ని పిల్లలు బయటపడ్డాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కట్లపాములు సాధారణంగా రాత్రివేళల్లోనే ఎక్కువగా సంచరిస్తాయి. ఇవి మనుషులు పడుకునే పరుపులు లేదా దుప్పట్ల వెచ్చదనం కోసం ఇళ్లలోకి వస్తుంటాయి. వీటి కాటు చాలా చిన్నదిగా ఉండటం వల్ల నిద్రలో ఉన్నవారికి పాము కుట్టిందనే విషయం కూడా తెలియకపోవచ్చు. కానీ వీటి విషం నేరుగా నాడీ వ్యవస్థపై దాడి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…