తెలంగాణ ప్రజలకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఆర్టీసీ సేవలను మరింత విస్తరించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సులను తిప్పనున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామని, ఇంకా తిరగని గ్రామాలు ఉంటే వాటిని గుర్తించి బస్సులను నడుపుతామని తెలిపారు. ప్రజాప్రభుత్వంతో ప్రజలందరికీ సమన్యాయం కల్పిస్తున్నట్లు చెప్పారు.
రోడ్డు సౌకర్యం ఉంటే..
రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులు తిరిగేలా చర్యలు చేపట్టినట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై ఉప్పునుంతల పరిధిలోని డిండికట్ట మైసమ్మ ఆలయ కొత్త పాలకమండలి ప్రమాణస్వీకారానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మహిళల అభివృద్దిని కోరుకునే ప్రభుత్వం తమదని అన్నారు. ఆలయాల అభివృద్ది కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని, దీని వల్ల కాలుష్యం తగ్గుతుందన్నారు. భవిష్యత్తులో డీజిల్ బస్సుల స్ధానంలో ఎలక్ట్రిక్ బస్సులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.